ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురం శ్రీవేంకటేశ్వ ర స్వామి ఆలయంలో వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం శ్రీవారికి సుప్రభాత సేవతో పాటు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. అలాగే, స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లకు వేపపూవు ప్రసాదం నివేదించారు. ఆతర్వాత సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణి నుంచి ఈఓ కె.జగన్మోహన్రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, అర్చకులు, సిబ్బంది మేళతాళాల నడుమ తీర్థపు బిందె తీసుకురావడంతో పాటు ఉత్సవమూర్తులను యాగశాలకు చేర్చారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం ఉగాది సందర్భంగా అర్చకులు పంచాంగ శ్రవణం చేశారు. ఆతర్వాత శ్రీవారి నిత్యకల్యాణం జరిపించగా పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సర్పంచ్ తుళ్లూరు నిర్మల, వ్యవస్థాపక ధర్మకర్తలు ఉప్పల విజయదేవశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.


