కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం సహకారనగర్ : జనగణనను పటిష్టంగా చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. జన గణనపై కలెక్టరేట్ సమావేశంలో మందిరంలో అధికారులకు మూడు రోజుల పాటు ఇవ్వనున్న శిక్షణను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వివిధ పథకాల రూపకల్పన, నియోజకవర్గాల పునర్విభజన, ఓటరు నమో దు ప్రక్రియకు జనగణన సమాచారం కీలకమని అన్నారు. జనగణన ఎన్యుమరేషన్ బ్లాక్ ఎంపిక ప్రక్రియ చేయాలన్నారు. డిజిటల్ ఆధారంగా గణన ప్రక్రియ చేపట్టాలని, పౌరులు వెబ్ ఆధారంగా తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని ఆదేశించారు. మే 11 నుంచి జూన్ 9వరకు మొదటి దశ, 2027 ఫిబ్రవరిలో రెండో దశ జనగణన ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, సీపీఓ ఎ.శ్రీనివాస్, డీఆర్వో పద్మశ్రీ, డీపీఓ రాంబాబు, మాస్టర్ ట్రైనర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
రేక్ పాయింట్కు చేరిన యూరియా
చింతకాని: మండల పరిధిలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్కు ఆదివారం ఎన్ఎఫ్ఎల్ కంపెనీకి చెందిన 2,643.75 మెట్రిక్ టన్నుల యూరియా చేరినట్లు జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. ఇందులో ఖమ్మం జిల్లాకు 1,143.75 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి జిల్లాకు 300 మెట్రిక్ టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 1,000 మెట్రిక్ టన్నులు, ఖమ్మం సీఆర్పీకి 200 మెట్రిక్ టన్నులను సరఫరా చేసినట్లు వివరించారు.
న్యాయవాదికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు
ఖమ్మం స్పోర్ట్స్ : ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నాలుగేళ్లకోసారి ప్రదానం చేసే అత్యుత్తమ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఖమ్మానికి చెందిన ప్రముఖ న్యాయవాది స్వామి రమేష్కుమార్కు దక్కింది. చైన్నెలో జరిగిన 11వ సీనియర్ జాతీయస్థాయి బాడీబిల్డింగ్ చాంపియన్షిప్ పోటీల సందర్భంగా ఈ అవార్డును 14వ తేదీన స్థానిక ఎంపీ టి.ఆర్.బాలు రమేష్కుమార్కు అందజేశారు.
గ్యాస్ అక్రమ వినియోగంపై తనిఖీలు
ఖమ్మం సహకారనగర్ : గ్యాస్ అక్రమ వినియోగంపై జిల్లాలోని గ్యాస్ గోదాములు, హోటళ్లలో ఆదివారం ముమ్మర తనిఖీలు చేపట్టినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్కుమార్ తెలిపారు. కొణిజర్లలోని చాణక్య గ్యాస్ ఏజెన్సీ గోదామును తనిఖీ చేసి, అక్రమంగా సరఫరా చేయొద్దని డీలర్కు ఆదేశాలు జారీ చేశామన్నారు. వినియోగదారులకు రీఫిల్ సిలిండర్లు సీనియారిటీ క్రమంలో మాత్రమే అందజేయాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించొద్దని సూచించామని అన్నారు. కాగా, తమ తనిఖీల్లో వ్యాపార అవసరాలకు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా వినియోగిస్తున్న విషయం వెలుగులోకి వచ్చిందని, మొత్తంగా 21 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ మేరకు యజమానులపై 6ఏ కేసు నమోదు చేసినట్లు చెప్పారు.


