గ్యాస్ బుకింగ్ పేరుతో
మోసాలు
గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ లైన్లు
అదనపు సిలిండర్ ఉన్నవారి
ముందస్తు జాగ్రత్తలు
ముమ్మర తనిఖీలు
నేలకొండపల్లి: యుద్ధ ప్రభావం వంట గ్యాస్ వినియోగదారులను హైరానాకు గురి చేస్తోంది. వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిపివేసినా, గృహా అవసరాలకు గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం ప్రకటించింది. కానీ క్షేత్ర స్థాయిలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఇంటి నుంచి బుకింగ్ చేసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ సర్వర్ సమస్యతో అత్యధిక కనెక్షన్లు కలిగిన కంపెనీల వినియోగదారులకు ఇబ్బంది ఎదురవుతోంది. దీనికి తోడు కొందరు కొరత ఏర్పడుతుందనే భయంతో ఇప్పటికప్పుడు అవసరం ఉన్నా అదనపు సిలిండర్ కోసం బుకింగ్ చేసుకుంటున్నారు. నేలకొండపల్లి గ్యాస్ పాయింట్ వద్ద రోజుకు 50 – 60 సిలిండర్ల బుకింగ్ జరిగేది. కానీ ఇప్పుడు 120కు పైగా దాటుతుండగా శనివారం పాయింట్ వద్దకు కాళీ సిలిండర్లతో వచ్చిన పలువురు క్యూలో ఉండడం కనిపించింది.
బారులు దీరిన జనం
కల్లూరురూరల్: వంట గ్యాస్ కొరత ఏర్పడుతుందన్న ప్రచారంతో కల్లూరు భారత్ గ్యాస్ ఏజన్సీ ఎదుట శనివారం పలువురు క్యూ కట్టారు. పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాలకు 45 రోజులకొక సిలిండర్ బుకింగ్కు అవకాశముంది. దీంతో పలువురు ఏజెన్సీ వద్దకే వచ్చి తీసుకెళ్తున్నారు.
నేలకొండపల్లిలో క్యూలో పెట్టిన సిలిండర్లు
ఖమ్మంక్రైం: గ్యాస్ సిలిండర్ల బుకింగ్ పేరుతో సైబర్ మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నందున వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసు కమిషనర్ సునీల్దత్ సూచించారు. వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా వచ్చే అనుమానిత లింక్లు ఓపెన్ చేయొద్దని తెలిపారు. తక్షణ డెలివరీ ఆశ చూపి డబ్బులు, కేవైసీ అప్డేట్ పేరుతో ఓటీపీ అడిగే అవకాశముందని చెప్పారు. అధికారిక యాప్ లేదా వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి తప్ప తెలియని లింక్లను క్లిక్ చేయకూడదని సూచించారు. ఎవరైనా ఫోన్ చేసి కేవైసీ అప్డేట్, సబ్సిడీ పేరుతో ఓటీపీ, బ్యాంక్ వివరాలు అడిగితే నిరాకరించాలని తెలిపారు. ఎవరైనా మోసపోతే వెంటనే 1930 నంబర్కు ఫోన్ చేయడంతో పాటు cybercrime.gov.inలో రిపోర్ట్ చేయాలని సీపీ ఓ ప్రకటనలో సూచించారు.
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో అక్రమ గ్యాస్ వినియోగాన్ని కట్టడి చేసేందుకు ముమ్మర తనిఖీలు చేస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఖమ్మంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీ చేయగా 20 డొమిస్టిక్ సిలిండర్లు సీజ్ చేశామని వెల్లడించారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. తనిఖీల్లో డిప్యూటీ తహసీల్దార్ విజయ్బాబు, కిరణ్, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.


