ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని సర్వజ్ఞ పాఠశాల వార్షికోత్సవాన్ని సృజనోత్సవ్ పేరుతో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రజాకవి, సినీ గేయ రచయిత పద్మశ్రీ సుద్దాల అశోక్తేజ హాజరుకాగా.. కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, పాఠశాల చైర్మన్ ఆర్వీ.నాగేంద్రకుమార్, డైరెక్టర్ నీలిమతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ నీరజ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ అనేది ప్రాథమికంగా తల్లిదండ్రుల ప్రోత్సాహంపైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఈమేరకు పిల్లల ఆశలు, ఆకాంక్షలను తెలుసుకోవాలని, ఆపై ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో వారు రాణిస్తారని వెల్లడించారు. అనంతరం సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ ఏపీజే కలాం వంటి గొప్ప వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. పాఠశాల చైర్మన్ నాగేంద్రకుమార్, డైరెక్టర్ నీలిమ మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థులను పుస్తక జ్ఞానానికే పరిమితం చేయకుండా వారిలో సృజనాత్మకతను వెలికి తీయటమే లక్ష్యంగా పని చేస్తున్నామని వెల్లడించారు. క్రమశిక్షణతో కూడిన విద్యతో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకోగా.. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
‘సర్వజ్ఞ’ సృజనోత్సవ్లో వక్తలు


