నేలకొండపల్లి: ఓ చిన్నారితో అనుచితంగా ప్రవర్తించిన యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మండలంలోని ఓ గ్రామంలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల చిన్నారి పాఠశాలకు వెళ్లి వస్తుండగా అదే గ్రామానికి చెందిన యువకుడు చాక్లెట్, కూల్ డ్రింక్స్ ఇస్తానని ఇంట్లోకి తీసుకెళ్లి సెల్ఫోన్లో అసభ్యకరమైన వీడియోలు చూపిస్తూ అనుచితంగా ప్రవర్తించాడు. ఆపై చిన్నారి ఏడుస్తుండడంతో పారిపోయాడు. పాప కుటుంబీకులకు విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా శనివారం పోక్సో కేసు నమోదు చేశారు.
విద్యుదాఘాతంతో 15 గొర్రెలు మృతి
కొణిజర్ల: నీళ్లు తాగేందుకు ఏటిలో దిగిన గొర్రెలు విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డాయి. నారాయణపేట జిల్లాకు చెందిన పోతుల చిన్నవెంకటప్ప, జోజాపురం బాలరాజు తమ గొర్రెలతో కొణిజర్ల మండలానికి వచ్చారు. ఈ సందర్భంగా మండలంలోని గద్దలగూడెం – అరికాయలపాడు సమీపాన చేలల్లో శనివారం మేపుతుండగా సమీప పెద్ద ఏరులో నీరు తాగేందుకు 15 గొర్రెలు దిగాయి. ఆపై విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డాయి. అయితే, కొందరు రైతులు ఏరు నుంచి పంటలకు నీరు పట్టేందుకు సబ్ మెర్సిబుల్ మోటార్లను ఏర్పాటుచేసినట్లు తెలిసింది. ఆ మోటర్లకు సంబంధించి సర్వీస్ వైర్ తెగిపోవడంతో గొర్రెలకు షాక్ వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు ట్రాన్స్కో వైరా డీఈ రమేష్ పరిశీలించి వివరాలు సేకరించారు.


