నేలకొండపల్లి: పాతకక్షల నేపథ్యంలో ఇద్దరు యువకులు కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. నేలకొండపల్లికి చెందిన చింతల ప్రవీణ్ అదే గ్రామానికి చెందిన లక్కం విజయ్ మధ్య ఇటీవల ఘర్షణలు జరుగుతున్నాయి. మంగళవారం సాయంత్రం పెట్రోల్బంక్ సెంటర్ సమీపంలో ఇద్దరు తారసపడ్డారు. మాట, మాట పెరిగి, ఇద్దరూ కత్తులతో దాడి చేసుకుని, తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
సర్పంచ్ మృతికి నివాళి
కారేపల్లి: మండలంలోని పాతకమలాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ తేజావత్ బాబూరావు (50) గుండెపోటుతో బుధవారం సాయంత్రం మృతి చెందగా పలువురు నివాళులర్పించారు. పాతకమలాపురం గ్రామ పంచాయతీ చిమ్నాతండా గ్రామానికి చెందిన తేజావత్ బాబూరావు కాంగ్రెస్ పార్టీలో ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చేసి విజయం సాధించారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ పంచాయతీ సిబ్బందితో పని చేయించి సాయంత్రం 6 గంటల సమయంలో బాబూరావు ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలోనే అకస్మాత్తుగా గుండెపోటు రావటంతో కుప్పకూలిపోగా కుటుంబ సభ్యులు ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య హైమావతి, ఇద్దరు కుమార్తెలు మమత, తేజస్విని, కుమారుడు శ్రీనివాస్ ఉన్నారు.


