నేలకొండపల్లి: జిల్లాలో పది గ్రామపంచాయతీ కార్యదర్శులను బదిలీ చేశారు. ఈమేరకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్ లోకల్ కేడర్లో భాగంగా 317 జీఓ ప్రకారం ఈ బదిలీలు జరగగా, వీరిని ఇతర జిల్లాలకు కేటాయించారు. రెబ్బవరం కార్యదర్శి కృష్ణయ్యను మంచిర్యాల జిల్లాకు, తల్లంపాడు కార్యదర్శి జంబుగ బుచ్చన్నను ఆదిలాబాద్, ఎం.వీ.పాలెం కార్యదర్శి జూకంటి శ్రీకళను పెద్దపల్లి జిల్లాకు, ముద్దునూరు కార్యదర్శి ఈ.ఏకలక్ష్మిని జనగామకు, తుంబూరు కార్యదర్శి నవీన్ను నిర్మల్కు, నేలకొండపల్లి కార్యదర్శి పి.శ్రీనివాస్ను కరీంనగర్ జిల్లాకు కేటాయించారు. అలాగే, తిరుమలాయపాలెం కార్యదర్శి పి.సజాతను జగిత్యాలకు, పిండిప్రోలు కార్యదర్శి టి.రామును పెద్దపల్లికి, బీరోలు కార్యదర్శి రఘునాథన్ను ఆసిఫాబాద్కు, పెనుబల్లి కార్యదర్శి ముస్తఫాను కరీంనగర్ జిల్లాకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పెద్దాస్పత్రిలో
క్లిష్టమైన శస్త్రచికిత్స
ఖమ్మంవైద్యవిభాగం: గుండెజబ్బుతో బాధపడుతున్న గర్భిణికి ఖమ్మం జిల్లా జనరల్ ఆస్పత్రి వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన ఆర్.శిరీషను రెండో కాన్పు కోసం ఈనెల 4న రాత్రి ఖమ్మం ఎంసీహెచ్లో చేర్పించారు. ఆమె గుండెజబ్బుతో బాధపడుతున్నట్లు గుర్తించిన గైనకాలజీ, అనస్తీషియా, కార్డియాలజీ , జనరల్ మెడిసిన్ విభాగాల వైద్యులు శస్త్రచికిత్స చేయడంతో ఆడపిల్లకు జన్మనిచ్చింది. వివిధ విభాగాల హెచ్ఓడీలు యామిని, సీతారాంనాయక్, రాంప్రసాద్, గాయత్రి, ఉద్యోగులను జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్ అభినందించారు.
ఒత్తిడికి గురికాకుండా చదువులో రాణించాలి
ఖమ్మం మామిళ్లగూడెం: విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా చదువుకుని రాణించాలని ఖమ్మం టూ టౌన్ సీఐ వెంకటేశ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ రాంబాబు సూచించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యాన పదో తరగతి విద్యార్థులకు జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ మంచికంటి భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వంకాయల రాజు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వెంకటేశ్, రాంబాబు మాట్లాడుతూ గత 30ఏళ్లుగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యాన టాలెంట్ టెస్ట్ నిర్వహించటం అభినందనీయమని తెలిపారు. వీటి ద్వారా విద్యార్థులకు పరీక్షలపై అవగాహన ఏర్పడి మంచి మారమార్కులు సాధించడం సాధ్యమవుతుందన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ మాట్లాడుతూ మండలాల వారీగా పరీక్షలు నిర్వహించి.. మమొదటి ఐదు స్థానాల్లో నిలిచిన వారికి జిల్లా స్థాయిలో టాలెంట్ నిర్వహించినట్లు తెలిపారు. నాయకులు దొంతబోయిన వెంకటేష్, త్రినాథ్, సుశాంత్, సింధు, శ్యామ్, లోహిత్కుమార్, లోకేష్, జానీపాషా, హారిక, కీర్తన, అశోక్, సాయి, పూజిత, నవ్య తదితరులు పాల్గొన్నారు.
మద్యం అమ్మితే
రూ.25 వేల జరిమానా..
వెంకటాపురం గ్రామస్తుల తీర్మానం
కరకగూడెం: మండలంలోని వెంకటాపురం గ్రామంలో మద్యపాన నిషేధానికి పంచాయతీ పాలకవర్గం నడుం బిగించింది. ఈ మేరకు సర్పంచ్ చౌలం కేశవరావు ఆధ్వర్యంలో గురువారం గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పరిధిలో ఎవరైనా మద్యం విక్రయించినా, రవాణా చేసినా రూ.25వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అక్రమ విక్రయాల సమాచారం అందించిన వారికి రూ.2 వేల నగదు బహుమతి అందజేస్తామని వెల్లడించారు. అనంతరం ఉపసర్పంచ్ ఈసం కోటేశ్వరరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్తో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో తీర్మాన ప్రతిని అందజేశారు.


