అరటి.. లాభాల్లో మేటి..!
ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహకాలు
సేంద్రియం.. మంచి ఆదాయం
● ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల ఆదాయం ● సేంద్రియ సాగు ద్వారా మరింత దిగుబడి ● నానాటికీ రైతుల్లో పెరుగుతున్న ఆసక్తి
ఏన్కూరు: ఏటా పత్తి, మిర్చి, వరి సాగు చేస్తున్న రైతులు చాలా మందికి ఆశించిన స్థాయిలో లాభాలు రావడం లేదు. చీడపీడల బెడదకు తోడు వాతావరణం అనుకూలించక ఈ పరిస్థితి ఎదురవుతోంది. ఈ నేపథ్యాన పలువురు రైతులు సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి ఉద్యానవన పంటలపై దృష్టి సారిస్తున్నారు. ఇదే సమయాన రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ విధానాలు అవలంబిస్తుండడంతో అధిక దిగుబడులు.. తద్వారా లాభాలు పొందుతున్నారు. ఈ క్రమంలో వైరా నియోజకవర్గంలోని పలువురు రైతులు ఒకరిని చూసి ఇంకొకరు అరటి సాగుపై ఆసక్తి పెంచుకుని లాభాల బాట పడుతుండడం విశేషం.
ఒకసారి పంట.. రెండేళ్ల దిగుబడి
గతంలో జిల్లాకు సరిహద్దుగా ఉన్న ఆంధ్రప్రదేశ్లోనే అరటి సాగయ్యేది. అక్కడి నుంచే వ్యాపారులు జిల్లాకు దిగుమతి చేసుకునేవారు. కానీ, ఇప్పుడు వైరా నియోజకవర్గంలోని కారేపల్లి, ఏన్కూరు, జూలూరుపాడు, వైరా, కొణిజర్ల మండలాల్లో సుమారు వంద ఎకరాల మేరకు అరటి సాగవుతోంది. ఏన్కూరు మండలం రేపల్లెవాడ, హిమామ్నగర్, తూతకలింగన్నపేట, కేసుపల్లి గ్రామాల రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఎకరానికి రూ.2 లక్షల వరకు పెట్టుబడితో వేయి వరకు అరటి మొక్కలు నాటుతున్నారు. ఇవి కూడా విడతల వారీగా నాటుతుండడంతో రెండేళ్ల వరకు దిగుబడి వస్తోంది. అంతా అనుకూలిస్తే ఎకరాకు 15 – 20 టన్నుల దిగుబడి వస్తుండగా, టన్నుకు రూ.15 వేల నుంచి రూ.20 వేల ఆదాయం లభిస్తోంది. విడతల వారీగా ప్రతిరోజు 2 – 3 గెలలు వస్తుండడంతో స్వయంగా మార్కెట్లో విక్రయిస్తున్నారు. మరికొందరు పొలం పక్కనే డజన్ రూ.50 విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు.
రైతులు ఒకే పంట కాకుండా మారుస్తూనే ఉద్యానవన పంటలపై దృష్టి సారించాలి. ఈ పంటల సాగుకు ముందుకొచ్చే వారికి ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్పై సబ్సిడీ ఇస్తోంది. అరటి సాగుతో నికర ఆదాయం ఉంటుంది. సేంద్రియ సాగు విధానం అవలంబిస్తే అరటి పండు త్వరగా పాడవదు. ప్రజల ఆరోగ్యానికి మేలు చేసినట్లవుతుంది. –ఆకుల వేణు,
వైరా డివిజన్ ఉద్యానవన శాఖాధికారి
ఏన్కూరు మండలం తూతకలింగన్నపేటకు చెందిన ఈ రైతు పేరు ఎం.శివకిశోర్. ఎకరా పొలంలో సేంద్రియ విధానంలో అరటి సాగు చేస్తున్నాడు. ఈ రైతుకు ఆవులు కూడా ఉండడంతో జీవామృతం, నిమ్మస్త్రం, పిప్పి ఆకు కషాయం పంటకు వేస్తూ రసాయన ఎరువుల జోలికి వెళ్లడం లేదు. అరటి తోట ద్వారా నిత్యం 2 – 3 గెలలు వస్తుండడంతో ఇంటి వద్దే విక్రయిస్తున్నాడు. సేంద్రియ విధానం అవలంబిస్తున్నందున అరటి పండ్లు వారం – పది రోజులు నిల్వ ఉంటున్నాయని చెబుతున్నాడు. అంతేకాక మొక్కల మధ్యలో సపోట, ధానిమ్మ, నిమ్మ, ఉసిరి, బాదం మొక్కలు కూడా నాటాడు. అరటితో లాభాలు ఉన్నందున మరో నాలుగు ఎకరాల్లో సాగు కోసం కౌలుకు తీసుకున్నాడు.
అరటి.. లాభాల్లో మేటి..!
అరటి.. లాభాల్లో మేటి..!
అరటి.. లాభాల్లో మేటి..!


