వేసవిలో సాఫీగా విద్యుత్ సరఫరా
ఖమ్మంవ్యవసాయం: రానున్న వేసవిలో విద్యుత్ ఉపయోగం పెరగనున్నందున ఎక్కడా అవాంతరాలు ఎదురుకాకుండా సరఫరా చేసేలా సిద్ధం కావాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్స్) టి.మధుసూదన్ సూచించారు. ఖమ్మంలోని విద్యుత్ గెస్ట్హౌస్లో గురువారం జరిగిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. సమావేశంలో చీఫ్ ఇంజనీర్ (ఆపరేషన్స్–2) రాజుచౌహాన్, చీఫ్ ఇంజనీర్ (ఎంఆర్టీ) అన్నపూర్ణాదేవి, ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తదితరులు పాల్గొనగా అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా కోసం తీసుకోవాల్సిన చర్యలపై డైరెక్టర్ దిశానిర్దేశం చేశారు.
చేపట్టాల్సిన పనులు ఇవే..
విద్యుత్ సరఫరాలో అంతరాయం రాకుండా అధికారులు ముందస్తు కార్యాచరణ రూపొందించాలని డైరెక్టర్ సూచించారు. ఫీడర్ లైన్ల పనితీరును పరిశీలించడంతో పాటు ఇంటర్ లింకింగ్ లైన్ల పనుల్లో వేగం పెంచాలని తెలిపారు. అలాగే, డీటీఆర్(డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్)ల వద్ద అంతరాయం రాకుండా చూడాలని, సింగిల్ ఫేజ్ ఏబీ స్విచ్లను అవసరమైన ప్రాంతాల్లో అమర్చాలని చెప్పారు. ఇదే సమయాన వ్యవసాయ విద్యుత్ సరఫరాకు సంబంధించిన పెండింగ్ పనులు కూడా త్వరగా పూర్తిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయి సిబ్బందితో అధికారులు సమన్వయం పెంచుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని డైరెక్టర్ మధుసూదన్ వివరించారు.
ముందస్తు కార్యాచరణపై అధికారుల సమీక్ష


