రిటైనింగ్ వాల్తో ముంపు కష్టాలకు చెక్
● మున్సిపాలిటీలో సమస్యల పరిష్కారమే ధ్యేయం ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీలో ప్రతీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని.. ఇన్నాళ్లు జరిగిన అభివృద్ధికి రెట్టింపు చేస్తానని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తద్వారా రాష్ట్రంలోనే మోడల్ మున్సిపాలిటీగా నిలబెడతానని వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధిలోని 2, 22, 23, 24, 26, 27 వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ మంత్రి సోమవారం రాత్రి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కూడళ్లలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ మాట ఇచ్చి తప్పే అలవాటు తనకు లేదని తెలిపారు. వచ్చే జూన్ కల్లా మున్నేటికి రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేసి వరద కష్టాలకు శాశ్వతంగా చెక్ పెడతానని వెల్లడించారు. ఇది ఎన్నికల సమయాన ఇస్తున్న వాగ్దానం కాదని.. చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. రూ.690 కోట్లతో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ ఏదులాపురానికి రక్షణ కవచంలా మారుతుందన్నారు. అలాగే, రాజీవ్గృహకల్ప ఇళ్లకు కొత్త హంగులు అద్దడంతో పాటు ప్రతీ ఇంటికీ నల్లా నీరు అందించే బాధ్యత తనదేనని తెలిపారు. ఇప్పటికే మున్సిపాలిటీ పరిధిలో సుమారు రూ. 308 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతుండగా, ప్రతీ సమస్య పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు. గత సర్కార్ ప్రజలను ముంచినట్లుగా కాకుండా తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు ఆపన్న హస్తం అందిస్తోందని పొంగులేటి తెలిపారు. అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రచారంలో వార్డు అభ్యర్థులు, నాయకులు ఏనుగు స్వరూప, పోకబత్తిని అనిత, బానోత్ భాస్కర్, బానోత్ దివ్య, భూక్యా పూల్చంద్, తోట చినవెంకటరెడ్డి, ఒంటికొమ్ము శ్రీనివాసరెడ్డి, ఏనుగు మహేష్, బానోత్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
నేడు ఐదు వార్డుల్లో...
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ప్రచారం చేయనున్నారు. ఈమేరకు 7, 8, 9, 12, 13 వార్డుల్లో మంత్రి పొంగులేటి ఉదయం 8–30 నుంచి 10–30 గంటల వరకు ప్రచారంలో పాల్గొంటారు.


