అజెండా.. లోకల్!
సమస్యలే అస్త్రాలు
ఇక్కట్లను ప్రస్తావిస్తున్న ప్రజలు నిధుల వరద పారిస్తామని కాంగ్రెస్ హామీల వర్షం మా హయాంలోనే అభివృద్ధి జరిగిందంటున్న బీఆర్ఎస్
కాంగ్రెస్ అభివృద్ధి మంత్రం
మున్సిపాలిటీల్లో అభివృద్ధికి పెద్దపీట వేసింది తామేనని కాంగ్రెస్ అభ్యర్థులు చేస్తున్న ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలకు రూ.కోట్ల నిధులు విడుదలై నిర్మాణ దశలో ఉన్నాయని వివరిస్తున్నారు. ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీల ఏర్పాటు తమ ఘనతేనని ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున మున్సిపాలిటీల్లోనూ గెలిపిస్తే జనానికి ప్రయోజనం జరుగుతుందని చెబుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అంతేకాక రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులతో కరపత్రాలు విడుదల చేస్తున్నారు.
మహర్దశ మా హయాంలోనే..
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మున్సిపాలిటీలు గణనీయమైన అభివృద్ధి సాధించాయని చెబుతున్నారు. పట్టణ ప్రగతి పేరుతో మున్సిపాలిటీలకు జవసత్వాలు నింపగా.. డంపింగ్యార్డులు, శ్మశానవాటికల నిర్మాణం, పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటుచేశామని వివరిస్తున్నారు. ప్రస్తుతం సమస్యలు పేరుకుపోయాయని.. తమకు అవకాశం కల్పిస్తే వాటి పరిష్కారానికి పాటుపడతామని హామీలు గుప్పిస్తున్నారు. సరిపడా నిధుల కోసం పోరాడుతామని.. తద్వారా వసతులు కల్పించడమే కాక దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తామంటూ బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో చెబుతున్నారు.
ఆ పార్టీలదీ అదే దారి
ఇక కమ్యూనిస్టు పార్టీలు కూడా సమస్యలనే ఆయుధంగా మార్చుకున్నాయి. సీపీఎం – బీఆర్ఎస్తో జత కట్టి వార్డుల్లో సమస్యలపై ఫోకస్ పెట్టారు. సమస్యలను ప్రస్తావించడమే కాక అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రశ్నలు సంధిస్తూ ప్రచారం చేస్తున్నారు. తమ అభ్యర్థులను ఎన్నుకుంటే పోరాటాలతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సీపీఎం నాయకులు చెబుతున్నారు. మున్సిపాలిటీల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యల సాధనకు పోరాటాలు చేస్తామంటూ హామీ ఇస్తున్నారు. అలాగే, బీజేపీ అభ్యర్థులు కాంగ్రెస్, బీఆర్ఎస్లే లక్ష్యంగా.. స్థానిక సమస్యలను లేవనెత్తుతున్నారు. కేంద్రం నుంచి నిధులు వస్తున్నా బీఆర్ఎస్, కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి జరగలేదని ప్రచారం చేస్తుండడం గమనార్హం. ఇలా మున్సిపాలిటీ ఎన్నికల్లో అన్ని పార్టీల అభ్యర్థులు స్థానిక సమస్యలనే అస్త్రాలుగా మార్చుకుని ముందుకు వెళ్తూ ప్రచారాన్ని రోజురోజుకు హోరెత్తిస్తున్నారు.
జిల్లాలోని ఏదులాపురం, సత్తుపల్లి, మధిర, వైరా, కల్లూరు మున్సిపాలిటీల్లో ఓటర్లు సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల
కల్పనను కోరుతున్నారు. దీంతో అన్ని పార్టీల అభ్యర్థులకు అవే అస్త్రాలుగా మారాయి. అంతర్గత రహదారుల దుస్థితి, డ్రెయినేజీలు అస్తవ్యస్తం, వీధుల్లో చెత్త
పేరుకుపోవడం, డంపింగ్యార్డు సమస్య, అసంపూర్తిగా నిలిచిపోయిన నిర్మాణాలు, తాగునీటి సమస్య, పౌర సేవల్లో జాప్యం తదితర అంశాలను అభ్యర్థులు తమ ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు.
మున్సిపాలిటీల సమస్యలే అజెండాగా అభ్యర్థులు ప్రచార అస్త్రాలను సంధిస్తున్నారు.
అవసరమైన వసతులు కల్పిస్తామని హామీలు గుప్పిస్తుండగా.. స్థానికులు కూడా తమ డిమాండ్ల చిట్టాలను అభ్యర్థుల ముందు ఉంచుతున్నారు. సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, డ్రైయిన్లు ఇలా స్థానిక సమస్యలను పరిష్కరించిన వారికే ఓటు వేస్తామని ఖరాఖండిగా చెబుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు హామీలు ఇస్తూనే ఇప్పటివరకు మున్సిపాలిటీల్లో జరిగిన అభివృద్ధిని వివరిస్తుండగా.. బీఆర్ఎస్ అభ్యర్థులు తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, ఇప్పటి సమస్యలను లేవనెత్తుతున్నారు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం
స్థానిక సమస్యలే అభ్యర్థుల ప్రచారాస్త్రాలు
అజెండా.. లోకల్!


