ప్రాక్టికల్ పరీక్షలకు రెడీ
ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నాం..
● జూనియర్ కాలేజీల్లో ప్రత్యేక తరగతులు ● ‘ఆదర్శ’ నిధులతో సామగ్రి కొనుగోలు
ఖమ్మంసహకారనగర్: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించే షెడ్యూల్ విడుదలైంది. ఈమేరకు గత మూడు నెలల నుంచే విద్యార్థులకు బోధన మొదలుపెట్టారు జిల్లాలోని 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు గాను 1,224 మంది విద్యార్థులు సైన్స్ కోర్సులు అభ్యసిస్తున్నారు. ఇందులో ఎంపీసీ 873, బైపీసీ 351 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే, ఒకేషనల్ కోర్సుల్లో ప్రథమ సంవత్సరం 1,019, ద్వితీయ సంవత్సరంలో 767 మంది చదువుతున్నారు.
మూడు నెలల నుంచి తరగతులు
జూన్లో విద్యాసంవత్సరం మొదలుకాగా, సెప్టెంబర్ నుంచి విద్యార్థులకు ప్రాక్టికల్స్ బోధన ప్రారంభించారు. బైపీసీ విద్యార్థులకు బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎంపీసీ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ తరగతులను నిర్వహిస్తున్నారు. గత ఏడాది ల్యాబ్ల నిర్వహణ సామగ్రి కోసం ఇంటర్మీడియట్ విద్యాశాఖ విద్యార్థుల సంఖ్య ఆధారంగా కాలేజీలకు నిధులు కేటాయించింది. కానీ ఈ సారి నిధులు విడుదల కాలేదు. అయితే, అమ్మ ఆదర్శ కళాశాలల నిధుల నుంచి ల్యాబ్ల్లో అవసరమైన సామగ్రి కొనుగోలుకు అవకాశం కల్పించడంతో ఇబ్బంది ఎదురుకాలేదు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 21 వరకు నాలుగు విడతల్లో జరగనుండగా విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు.
ప్రాక్టికల్ పరీక్షలకు సిద్ధమయ్యేలా విద్యార్థులకు బోధిస్తున్నాం. అమ్మ ఆదర్శ కళాశాలల నుంచి ల్యాబ్లకు అవసరమైన సామగ్రి కొనుగోలుకు అవకాశం కల్పించారు. దీంతో ప్రణాళిక ప్రకారం తరగతులు నిర్వహిస్తున్నాం.
– ఆర్.గోవిందరావు, ప్రిన్సిపాల్,
ఏఎస్ఆర్ కాలేజీ, ఖమ్మం
ప్రాక్టికల్ పరీక్షలకు రెడీ


