
కొనుగోళ్లకు సిద్ధం
‘ఇందిరమ్మ’ సమస్యలకు పరిష్కారం
15రోజుల్లో 326కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు
ఇందిరమ్మ ఇళ్లకు అందుబాటులో గోదావరి ఇసుక
‘సాక్షి’ ఇంటర్వ్యూలో
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
‘జిల్లాలో పండించిన పత్తి, ధాన్యం కొనుగోళ్లకు యంత్రాంగం సిద్ధమైంది. అమ్మకానికి రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఎవరు కూడా దళారుల మాటలు నమ్మి
మోసపోవద్దు. దీపావళి తర్వాత ఎనిమిది సీసీఐ కేంద్రాల ద్వారా పత్తి, వచ్చే నెల మొదటి వారం నాటికి 326 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు మొదలవుతాయి. ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇబ్బంది
రాకుండా అన్ని నియోజకవర్గాల్లో గోదావరి ఇసుక అందుబాటులోకి తీసుకొచ్చాం. అధునాతన పరిజ్ఞానంతో ఖమ్మంలో రోడ్లకు మరమ్మతులు చేయిస్తున్నాం.’ అని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. పలు అంశాలపై ‘సాక్షి’కి శనివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో కలెక్టర్ వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే.. – సాక్షిప్రతినిధి, ఖమ్మం
యాప్లో నమోదు తప్పనిసరి
దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లకు చర్యలు చేపట్టింది. అయితే, రైతులు కపాస్ కిసాన్ యాప్లో పంట వివరాలను వ్యవసాయ శాఖ సిబ్బందితో నమోదు చేయించుకోవాలి. తద్వారా సీపీఐ కేంద్రాల్లో పత్తిని వెంటనే కొనుగోలు చేస్తారు. ఈ విషయమై రైతులకు ఇప్పటికే అవగాహన కల్పించాం. జిల్లాలోని ఎనిమిది జిన్నింగ్ మిల్లుల్లో దీపావళి తర్వాత సీసీఐ కేంద్రాలు ఏర్పాటవుతాయి. తేమ శాతం తక్కువగా ఉండి, నాణ్యమైన పత్తిని తీసుకొస్తే మద్దతు ధర లభిస్తుంది. ఈ విషయాన్ని రైతులు గుర్తించాలి. పత్తి కొనుగోళ్లను అదనపు కలెక్టర్, మార్కెటింగ్ అధికారులు పర్యవేక్షిస్తారు.
72గంటల్లోగా ధాన్యం నగదు, బోనస్
వరి ధాన్యం కొనుగోళ్లకు జిల్లాలో 326 కేంద్రాలు తెరుస్తాం. కల్లూరు మండలంలో ముందుగా కోతలు మొదలుకావడంతో అక్కడ రెండు కేంద్రాలు తెరిపించాం. వచ్చే నెల మొదటి వారం నాటికి అన్ని కేంద్రాలు తెరుచుకోనుండగా, ఒక్కో కేంద్రంలో నలుగురు సిబ్బంది ఉంటారు. అక్కడ కావాల్సిన వేయింగ్ మిషన్లు, గన్నీలు, టార్పాలిన్లు సిద్ధంగా ఉన్నాయి. ధాన్యం వివరాలు ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నమోదు చేసేలా సిబ్బందికి శిక్షణ ఇప్పించాం. సన్నధాన్యం అమ్మిన రైతుల ఖాతాల్లో 72 గంటల్లోగా మద్దతు ధర, బోనస్ జమ అవుతుంది. చివరి గింజ వరకు కొనుగోలు చేసేలా పౌర సరఫరాల సంస్థ, రెవెన్యూ అధికారులు పర్యవేక్షిస్తారు. ధాన్యం తరలించాక ఎలాంటి తరుగు తీయొద్దని మిల్లర్లకు చెప్పాం.
పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి
జిల్లాకు ఖమ్మం నగరం గుండెకాయ వంటింది. జిల్లా జనాభాలో సుమారు 50 శాతం ఇక్కడే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాం. రహదారులపై ఎక్కడా గుంతలు లేకుండా జాతీయ రహదారులకు వాడే కోల్డ్ మిక్స్ను మరమ్మతులకు వాడాలని చెప్పాం. ఇప్పటికే ఈ పనులు జరుగుతున్నాయి. కోల్డ్ మిక్స్ అనేది కొత్త టెక్నాలజీ. ఆర్అండ్బీ, ఎన్హెచ్ఏఐ, కార్పొరేషన్ అధికారులతో సమావేశమై రోడ్ల నిర్వహణ, మరమ్మతులపై సూచనలు చేశాం. అలాగే, శానిటేషన్ కోసం కొత్త పరికరాలు కొనుగోలు చేయాలని చెప్పాం. పర్యాటక అభివృద్ధిలో భాగంగా రోప్ వేకు అవసరమైన భూ సమస్య కూడా పరిష్కారమైంది. ఇక టీటీడీ ఆలయ నిర్మాణానికి అల్లీపురంలో భూమి గుర్తించాం.
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఇబ్బందులు లేవు. జిల్లా మంత్రుల ఆదేశాలతో ప్రతీ నియోజకవర్గంలో గోదావరి ఇసుకతో ఇసుక బజార్ ఏర్పాటు చేయించాం. కూసుమంచి, ఖమ్మంఅర్బన్, కామేపల్లి, మధిర, సత్తుపల్లిలోని ఈ పాయింట్ల ద్వారా ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుక అందిస్తున్నాం. స్థానికంగా ఇసుక దొరికితే అక్కడ కూడా కూపన్ల ద్వారా ఇప్పిస్తు న్నాం. ఆధార్లో పేరు తప్పుగా ఉండడం, బ్యాంక్ అనుసంధానం కాకపోవడంతో కొందరి ఖాతాలో నగదు పడలేదు. గతంలో ఇందిరమ్మ ఇళ్లు వచ్చిన వారితో ఇంకొన్ని కారణాలతో సుమారు 100మందికి ఖాతాలో డబ్బ జమ కాలేదు. వీటిపై విచారణ చేపట్టి పరిష్కరించాం. జిల్లాలో 16వేలకు పైగా చిలుకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైతే వంద వరకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి. లబ్ధిదారులందరికీ దశల వారీగా క్రమం తప్పక బిల్లులు చెల్లిస్తున్నాం.
దీపావళి తర్వాత పత్తి కొనుగోళ్లకు సీసీఐ కేంద్రాలు

కొనుగోళ్లకు సిద్ధం