కోలారు: జిల్లాలో మైనారిటీ విద్యా, సామాజిక అభివృద్ధికి ప్రవేశపెట్టిన పథకాలు కేవలం రికార్డులకే పరిమితం అయ్యాయి. వీటిని జన సామాన్యుల చెంతకు అందించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఆర్.రవి అధికారులకు సూచించారు. శుక్రవారం నగరంలోని కలెక్టర్ కార్యాలయ సభాంగణంలో ప్రధానమంత్రి 15 అంశాల కార్యక్రమం ప్రగతి పరిశీలన సభకు అధ్యక్షత వహించి మాట్లాడారు. జిల్లాలోని మైనారిటీ మహిళల ఉన్నత విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో కొత్తగా వక్ఫ్ మహిళా పీయూ కళాశాల ప్రారంభించేందుకు సమావేశంలో తీర్మానం చేయడం జరిగిందన్నారు. అయితే కట్టడం లభ్యత లేదనే ఉద్దేశంతో దీనిని ప్రారంభించలేదన్నారు. కట్టడ నిర్మాణం జరిగే వరకు నగర సభ సముదాయ భవనం లేదా సరైన ప్రైవేటు భవనాన్ని అద్దెకు తీసుకుని విద్యా కార్యక్రమాలు ప్రారంభించాలని మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులకు సూచించారు. గాజుల దిన్న మొరార్జి దేశాయి మొడల్ సీబీఎస్సీ పాఠశాల ఏటా 100 శాతం ఫలితాలు సాధిస్తుండటం సంతోషకరమన్నారు. బంగారుపేట, కెజీఎఫ్లలో నిర్మాణం అవుతున్న మైనారిటీ విద్యార్థి వసతి నిలయాల పనులు నత్తనడకన సాగుతుండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్షాకాలం ప్రారంభం అయ్యే లోపు భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని తెలిపారు. సమావేశంలో జిల్లా సమితి సభ్యులు తఫిక్ అహ్మద్, శబీర్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.


