ఎమ్మెల్యే వినయ్ కులకర్ణికి
బనశంకరి: బీజేపీ నేత యోగేశ్గౌడ హత్యకేసులో ధార్వాడ గ్రామీణ కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి తో పాటు 17 మందికి శిక్షను ఖరారు చేయడంపై గురువారం బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో వాద ప్రతివాదనలు జరిగాయి. ధార్వాడ జిల్లా జడ్పీ సభ్యుడు యోగేశ్గౌడ హత్యకేసులో 17 మందిని దోషులుగా బుధవారం జడ్జి సంతోష్ గజానన భట్ తీర్పు ఇచ్చారు. గురువారం శిక్ష ఖరారు చేస్తామని ప్రకటించారు.
సీబీఐ వాదన ఇలా..
శిక్షలపై వాదనలు మొదలు కాగా, సీబీఐ న్యాయవాది ఎస్వీ రాజు వాదిస్తూ ఎమ్మెల్యే వినయ్కు జీవిత ఖైదును విధించాలన్నారు. రాజకీయ కారణంతో యోగేశ్గౌడ ను హత్య చేశారని, కేసును తారుమారు చేయాలని చూశారన్నారు. అతనికి ఉరిశిక్ష విధించాలని కోరడం లేదు, యావజ్జీవ శిక్ష విధించాలని అభ్యర్థిస్తున్నట్లు ఎస్వీ.రాజు వాదించారు.
పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు..
నిందితుల న్యాయవాది ఎంఎస్.శ్యామ్సుందర్ వాదిస్తూ.. నిందితులకు చిన్నపిల్లలు, వయసైన తల్లిదండ్రులు ఉన్నారని, యావజ్జీవ శిక్ష విధించాలనడం సబబు కాదన్నారు. వినయ్ కులకర్ణి మంచి వ్యక్తి అని, 3 వేలకు పైగా పశువులు, గేదేలను పోషిస్తున్నారని, తక్కువ శిక్ష విధించాలని విన్నవించారు. నేరస్తులకు జీవించే హక్కు న్యాయమూర్తి చేతిలో ఉందని అన్నారు. ఉభయుల వాదనలను ఆలకించిన న్యాయమూర్తి సంతోష్ గజానన భట్ శిక్షను శుక్రవారం ఖరారు చేస్తామని ప్రకటించి వాయిదా వేశారు.


