బళ్లారిఅర్బన్: నగర అభివృద్ధిలో వేగం పెంచే దిశగా పలు అభివృద్ధి పనులకు నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి గురువారం భూమిపూజ నిర్వహించారు. నగరంలోని 39వ వార్డు నేతాజీ నగర్లోని గణేష్ ఆలయం సమీపంలో రూ.80.63 లక్షల వ్యయంతో అంతర్గత డ్రైనేజీ మరమ్మతు పనులకు భూమిపూజ చేశారు. మహర్షి వాల్మీకి సర్కిల్ సమీపంలో ఎమ్మెల్యే ప్రత్యేక నిధుల ద్వారా నిర్మించిన దుకాణాలను వీధి వ్యాపారులకు పంపిణీ చేశారు. లబ్ధిదారుల పేర్లతో కూడిన చీటీలను లక్కీ డ్రా తీయడం ద్వారా పారదర్శకంగా వాటిని కేటాయించారు. పీ.జగన్, మారెణ్ణ, ఎరుకుల స్వామి, మల్లికార్జున స్వామి, సోమశేఖర్, సిద్దేశ్, సుబ్బరాయుడు, నరేంద్ర హాజరయ్యారు. 36వ వార్డు హవంబావి కాలువ వద్ద సుమారు రూ.2 కోట్ల వ్యయంతో రోడ్డు అభివృద్ధి, వర్షపు నీటి కాలువ, అంతర్గత డ్రైనేజీ పనులకు, అదే ప్రాంతంలోని ప్రాథమిక పాఠశాలలో రూ.16.5 లక్షలతో తరగతి గది నిర్మాణానికి భూమిపూజ చేశారు. టీఎంజీ లోకేష్, గంగప్ప, గంగాధర్, సోము, పాఠశాల హెచ్ఎం పాల్గొన్నారు. గడిగి చెన్నప్ప(రాయల్) సర్కిల్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు స్వయంగా ఎమ్మెల్యే సందర్శించి అధికారులు, ట్రాఫిక్ పోలీసులకు తగిన సూచనలిచ్చారు. ట్రాఫిక్ రద్దీని అరికట్టాలని ఆదేశించారు. గుగ్గరహట్టి వద్ద నిర్మాణంలో ఉన్న రోడ్డు వంతెన పనులను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు.


