దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో పలుచోట్ల జరిగిన ప్రమాదాల్లో పలువురు మరణించారు. రెండు బైక్లను లారీ ఒకేసారి ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందిన సంఘటన కలబుర్గి జిల్లా సేడం పట్టణం సమీపంలో జరిగింది. హలహర్తి గ్రామ నివాసి మహేశ్ (33),సేడం నివాసులు సంజయ్ (28), కాశీనాథ్ (18) రెండు బైక్లమీద కలబుర్గి నుండి సేడం వస్తుండగా, ఎదురుగా వచ్చిన లారీ వీరి బైక్లను ఢీకొట్టింది. దీంతో ముగ్గురూ అక్కడే దుర్మరణం చెందారు.
రాజధానిలో ముగ్గురు...
యశవంతపుర: బెంగళూరు నగరంలో మూడు వేర్వేరు ప్రమాదాలలో ముగ్గురు మృతి చెందారు. వివరాలు.. తలఘట్టపుర పోలీసుస్టేషన్ పరిధిలోని నైస్ రోడ్డులో నిలిచి ఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. యూపీకి చెందిన వలస కూలీ విజయ్ (29) చనిపోగా, మరొకరు గాయపడ్డారు.
● బుధవారం తెల్లవారుజామున చిక్కబాణవార బీఎఐ ఎల్ వంతెన రోడ్డులో కంకర లారీ, మినీ గూడ్స్ను ఢీకొంది. గూడ్స్లోని సాహిల్పాషా (25) మరణించాడు.
● చిక్కజాల మహదేవ కొడిగేహళ్లి రోడ్డులో అనిల్, నేత్ర దంపతులు బైక్లో వెళ్తూ నిర్మాణంలో ఉన్న కాలువలోకి పడిపోయారు. నేత్రా గాయపడగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. చిక్కజాల పోలీసులు కేసు నమోదు చేశారు.
2 బైక్లను లారీ ఢీ, ముగ్గురు మృతి
ఊరేగింపు మీదకు కారు, బాలిక మృతి
యశవంతపుర: చిక్కమగళూరు జిల్లా బిళేకల్లు గ్రామం వద్ద మంగళవారం రాత్రి అంబేడ్కర్ జయంతి ఊరేగింపులోకి కారు దూసుకెళ్లింది, ఈ ప్రమాదంలో శాన్వి (7) అనే బాలిక చనిపోగా, మరో ఏడుమంది గాయపడ్డారు. నిశ్చిత్, తృప్తి, తిమ్మరాజు, ఉషా, చేతన్, సృష్టి, నాగరాజులు గాయపడ్డారు, మెరుగైన చికిత్స కోసం హాసన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ సుధాకర్ను స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.


