● కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ అబ్దుల్ తొలగింపు
శివాజీనగర: దావణగెరె దక్షిణ అసెంబ్లీ క్షేత్రంలో కాంగ్రెస్ అభ్యర్థికి విరుద్ధంగా పని చేశారని ఆరోపణలు వచ్చిన చేసిన ఎమ్మెల్సీ అబ్దుల్ జబ్బార్ను పార్టీ మైనారిటీ విభాగం అధ్యక్ష పదవి నుంచి తొలగించడం తెలిసిందే. ఇప్పుడే ఏకంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నుంచి తీసేశారు. దీంతో అధికార పార్టీలో దావణగెరె అంశం చాలా సీరియస్గా ఉన్నట్లు తేలింది. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఈ ఆదేశాలిచ్చారు. పార్టీలో క్రమశిక్షణ, సమైక్యతను కాపాడడమే ప్రధానమని పేర్కొన్నారు.
ఒక్కొక్కరికి ఒక్కో న్యాయమా?
బనశంకరి: ప్రస్తుతం వేరే రేసు గుర్రాలు వచ్చాయి అని ఎమ్మెల్సీ అబ్దుల్ జబ్బార్ అన్నారు. పార్టీ నుంచి తొలగింపు తరువాత బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకుందో తెలియదు, 40 ఏళ్లుగా పార్టీలో ఉన్నాను, దావణగెరెలో చాలా అసంతృప్తిగా ఉంది అని చెప్పారు. తాము వ్యతిరేకంగా పనిచేసినట్లు ఆధారాలు ఉంటే చూపాలని, ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం చేస్తున్నారని విమర్శించారు. శామనూరు శివశంకరప్ప తరువాత వారికే ఎందుకు, ఇతరులకూ ఒక అవకాశం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు.
మూడేళ్ల తరువాత స్నాచర్ అరెస్టు
దొడ్డబళ్లాపురం: మూడేళ్ల క్రితం బంగారు గొలుసును తెంచుకెళ్లిన దొంగ ఎట్టకేలకు కనకపుర పోలీసులకు దొరికాడు. చామరాజనగర తాలూకా గాడిపుర గ్రామం నివాసి ఖలీల్ బాషా చూపా (33) పట్టుబడిన వ్యక్తి. 2023లో నడుచుకుంటూ వెళ్తున్న సరోజమ్మ అనే మహిళ మెడలో నుంచి 60 గ్రాముల బంగారు గొలుసు లాక్కుని పరారయ్యాడు. అప్పటినుంచి నిందితుడు పోలీసులు గాలిస్తున్నా దొరకడం లేదు. చిట్టచివరకు ఆచూకీ తెలుకుని నిందితున్ని అరెస్టు చేసి ఒక కారు, ఒక బైక్, 25 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.


