శివాజీనగర: ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగిన ప్రథమ పీయూసీ ఫలితాలను కేఎస్ఈఏబీ మంగళవారం ప్రకటించింది. విద్యార్థులు ఫలితాలను ఆన్లైన్లో వీక్షించవచ్చు. సుమారు 6 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు.
ఈ దఫా ఫలితాల పద్ధతిని మార్చారు. అందరి ఫలితాలను ఒకేసారి కాకుండా దశలవారీగా విడుదల చేస్తున్నట్లు బోర్డు తెలిపింది. పూర్తిగా విడుదల కావడానికి కొన్నిరోజులు పడుతుందని, విద్యార్థులు సహనంతో ఉండాలని తెలిపింది. వెబ్సైట్పై ఒత్తిడి తగ్గించడానికే ఇలా చేసినట్లు పేర్కొంది. ఫలితం రాలేదని విద్యార్థులు ఆందోళన చెందరాదని తెలిపింది.
అంత్యక్రియలకు వెళ్తుండగా ప్రమాదం
మండ్య: మద్దూరులో చిక్కరసినకెరె వంతెన వద్ద ఆటో రిక్షాను ఎద్దుల బండిని ఢీకొనగా ఒకరు చనిపోగా, ఐదుమంది గాయపడ్డారు. మృతుడు బెంగళూరుకు చెందిన సిద్ధరాజు (48) కాగా, భార్య భాగ్యమ్మ (42), దిలీప్ (22), మహాలక్ష్మి (10), మహాదేవ్ (8), ఆటో డ్రైవర్ చేతన్ (24) గాయపడ్డారు. బంధువు చనిపోవడంతో అంత్యక్రియలకని ఆటోలో కొల్లేగాళ తాలూకాలోని బన్నిసెరగా గ్రామానికి వెళుతున్నారు. తెల్లవారుజామున 5 గంటలకు ఎదురుగా వస్తున్న ఎద్దుల బండిని ఆటో ఢీకొనింది. సిద్ధరాజు అక్కడే మరణించాడు. డీఎస్పీ యశ్వంత్ కుమార్, కె. ఎం. దొడ్డి సీఐ అనిల్ కుమార్, సిబ్బంది చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు.


