రాయచూరు రూరల్: హట్టి బంగారు గనుల కంపెనీలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు కొత్త వేతనాలివ్వాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. సోమవారం హట్టి సమీపంలోని కంపెనీ కార్యాలయం ముందు చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మహంతేష్ మాట్లాడారు. 45 శాతం వేతనాలు పెంచాలని, సిబ్బంది భద్రతకు రూ.10 లక్షలు కేటాయించాలని, విద్య, వైద్య, ఆరోగ్య రంగాలకు పెద్ద పీట వేయాలని కోరారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ ఎండీ శిల్పాకు వినతిపత్రం సమర్పించారు.
దావణగెరె ఉప పోరుకు కాంగ్రెస్ పరిశీలకుడు
బళ్లారిఅర్బన్: దావణగెరె దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార పర్వానికి పరిశీలకుడిగా నగర మాజీ ఉపమేయర్, కేపీసీసీ సమన్వయకర్త బెణకల్ బసవరాజ్ నియమితులయ్యారు. పార్టీలో ఎన్నో ఏళ్లుగా నిబద్ధతతో పని చేస్తున్న నాయకుడిగా గుర్తింపు పొందిన బసవరాజ్కు ఈ బాధ్యతలను అప్పగించారు. ఉప ఎన్నికల్లో పార్టీ విజయానికి సమర్థవంతంగా ప్రచారం నిర్వహించేలా ఇతర నాయకులతో కలిసి పని చేయాలని కేపీసీసీ సూచించింది.
చలివేంద్రం ప్రారంభం
రాయచూరు రూరల్: నగరంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద క్రాంతి వీర సంగొళ్లి రాయణ్ణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నగరసభ మాజీ ఉపాధ్యక్షుడు పంపాపతి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చలివేంద్రాలతో వేసవిలో రెండు నెలల పాటు నగరానికి వచ్చే గ్రామీణ ప్రజలు, నగరవాసుల దాహార్తిని తీర్చవచ్చన్నారు. నగరంలోని స్టేషన్ రోడ్డు తదితర చోట్ల కూడా చలివేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
వ్యవసాయ వర్సిటీకి
వాల్మీకి పేరు పెట్టరూ
రాయచూరు రూరల్: నగరంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలక భవనానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టాలని క్రాంతి వీర సంగొళ్లి రాయణ్ణ సంఘం డిమాండ్ చేసింది. వ్యవసాయం విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ హన్మంతప్పకు వినతిపత్రం సమర్పించి కార్యాధ్యక్షుడు రఘువీర్ నాయక్ మాట్లాడారు. అధికారులు దృష్టి సారించి అధిక భాగం గ్రామీణ ప్రాంతాల నుంచి వ్యవసాయంలో మెలకువలు నేర్చుకోవడానికొచ్చే విద్యార్థులకు భవనాల పేర్లు గుర్తుండేలా చూడాలని కోరారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలక భవనానికి తోడు వివిధ శాఖల విషయంలో జాతీయ స్థాయి పేర్లను నమోదు చేసి రాయించాలన్నారు.
ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్
●14 మోటార్ సైకిళ్ల స్వాధీనం
హొసపేటె: వివిధ జిల్లాల్లో వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ మాన్యం మెహబూబ్ను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని వద్ద నుంచి 14 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో టౌన్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఆ మార్గంలో అనుమానాస్పదంగా వెళుతున్న నిందితుడిని పట్టుకుని విచారించగా బైక్ల వరుస చోరీల కేసు మిస్టరీ వీడింది. దీనిపై సోమవారం సాయంత్రం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఎస్పీ జాహ్నవి మాట్లాడుతూ నిందితుడు కొప్పళ జిల్లా మునిరాబాద్కు చెందిన వాడని తెలిపారు. నిందితుడు బళ్లారిలో రెండు, సండూరులో ఒకటి, గంగావతిలో ఒకటి, కంప్లిలో ఒకటి, మండ్య జిల్లాలో రెండు బైక్లను దొంగలించాడని, వీటి విలువ సుమారు రూ.12.81 లక్షలు ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. నిందితునిపై 2022లో టౌన్ పోలీస్ స్టేషన్, 2008లో కొప్పళ పోలీస్ స్టేషన్లో బైక్ చోరీ కేసులు నమోదైనట్లు ఆమె తెలిపారు.


