రాయచూరు రూరల్: దిగంబర్ జైన్ సమాజం ఆధ్వర్యంలో వర్థమాన్ మహావీర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. సోమవారం బైరూన్ కిల్లాలో వెలసిన భగవాన్ ఆదినాథ్ దిగంబర జైన్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. భగవాన్ ఆదినాథ్ దిగంబర జైన్ ఆలయం నుంచి మహావీర్ సరి్క్ల్ వరకు మహిళలు కుంభకలశాలతో ఊరేగింపు నిర్వహించారు. పార్శ్వనాథ్కు ఉదయం అభిషేకాలు, గంగ పూజలు జరిపారు. దిగంబర జైన్ సమాజం సంచాలకుడు మహావీర్, అమృత కీర్తి, స్మృతి సాగర్, కిరణ్ కుమార్, పండిత ఉపాధ్యాయ, అనిల్ కుమార్, మహాబలిలున్నారు.
విజయనగరలో...
హొసపేటె: ప్రపంచానికి అహింసా పరమో ధర్మః అని చాటి చెప్పిన జైన మత 24వ తీర్థంకరుడు, భగవాన్ మహావీరుని జన్మదినం పురస్కరించుకుని మహావీర్ జయంతిని దేశవ్యాప్తంగా జైన్ భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారని నగర కమిషనర్ వివేకానంద తెలిపారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహావీర్ జయంతిలో పాల్గొని ఆయన మాట్లాడారు. శాంతి, అహింస, కరుణ, సత్యం, త్యాగానికి ప్రతీకగా భావించే మహావీర్ జయంతిని చైత్ర మాసంలో శుక్లపక్ష త్రయోదశి నాడు జరుపుకుంటారన్నారు. బిహార్లోని వైశాలిలో క్రీ.పూ. 599లో జన్మించిన వర్ధమాన మహావీరుడు తన 30వ ఏట రాజ్యాన్ని, సంపదను త్యాగం చేసి సత్యాన్వేషణలో ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారన్నారు. ఈ పవిత్రమైన రోజున జైన్ భక్తులు మహావీరుని విగ్రహానికి పాలు, నీటితో అభిషేకం చేస్తారు. దేవునికి పండ్లు, మిఠాయిలు సమర్పిస్తారు. భగవాన్ మహావీర్ ఆశయాలను, బోధనలను స్మరించుకుంటూ దేశంలోని పలు నగరాల్లో భారీ శోభాయాత్రలు నిర్వహిస్తారన్నారు. అహింసను పాటించాలని, జీవులపై దయ కలిగి ఉండాలని ఈ వేడుకల్లో తెలిపారు. అదనపు పోలీస్ అధికారి మంజునాథ్, అధికారి సిద్దలింగయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు.


