సాక్షి బళ్లారి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్కీబాత్ ద్వారా దేశ ప్రజలకు ఇచ్చే సందేశాలు బాగున్నాయని మాజీ ఎమ్మెల్యే గాలిసోమశేఖర్ రెడ్డి కొనియాడారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ మన్కీబాత్ సందేశాన్ని జిల్లాలోని కురుగోడు తాలూకా దమ్మూరు వేంకావాదూత మఠంలో స్థానిక బీజేపీ కార్యకర్తలు, నేతలతో కలసి వీక్షించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్, డీజల్, గ్యాస్ సమస్యలు తలెత్తడంతో భారత్ జాగ్రత్తగా అడుగులు వేస్తోందన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని సూచించారు. ప్రధానమంత్రి మన్కీబాత్లో అనే ముఖ్యమైన అంశాలను తెరపైకి తెచ్చారన్నారు. దేశంలో కొత్త అభివృద్ధి పనులు, సాంకేతికతలో మార్పులు, సామాజిక అంశాలు, ప్రజాసామ్యంపై నమ్మకం తదితర విషయాలను చర్చించారన్నారు. యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమవంతుగా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. దేశ భద్రత, వైద్యుల సంక్షేమం, యువత భవిషత్తు తదితర అంశాలపై మన్కీబాత్లో చర్చించారన్నారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్ కుమార్మోకా, మాజీ మేయర్ గుర్రం వెంకటరమణ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కేఎస్ దివాకర్, కార్పొరేటర్లు కేఎస్ అశోక్, గోవిందురాజులు, మోత్కూర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


