యశవంతపుర: నగర జీవనం నుంచి విరామం తీసుకుని సముద్ర తీర ప్రాంతాలను చూసి రావాలనే ఆశ విషాదాంతమైంది. రోడ్డు పక్కలో నిలిపి ఉన్న కంటైనర్ లారీని వెనుక నుంచి కారు ఢీకొన్న ప్రమాదంలో తల్లీ కూతురు దుర్మరణం చెందారు. ఈ ఘటన ఉడుపి జిల్లా బైందూరు తాలూకా నావుంద వద్ద శనివారం రాత్రి జరిగింది. వివరాలు.. బెంగళూరు నుంచి విహారయాత్రకు వెళ్లిన మమత (36), ఆమె కూతురు ధృతిక (14) మరణించగా, భర్త రఘు (40), పిల్లలు జాహ్నవి (12), చార్వీ (10), కారు డ్రైవర్ కిరణ్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. బెంగళూరు నుంచి వెళ్లిన వీరు అనేక పర్యాటక స్థలాలను దర్శించారు. మురుడేశ్వర, గోకర్ణ క్షేత్రాలను చూడాలని వెళ్తున్నారు. బైందూరు వద్ద రోడ్డు పక్కలో నిలిపిన కంటైనర్ను కారు ఢీకొంది. కారు ముందుభాగం తుక్కుగా మారింది. ఇద్దరు అక్కడే చనిపోగా, మిగతావారికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ కిరణ్ అరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మత్తులో కారుతో బైక్ను ఢీ, ఇద్దరు మృతి
శివాజీనగర: మద్యం మత్తులో వన్ వేలో అతివేగంగా వచ్చిన కారు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనగా ఇద్దరు అక్కడే మరణించిన ఘటన బెంగళూరు నడిబొడ్డున హైగ్రౌండ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో వక్ఫ్ బోర్డు కార్యాలయం వద్ద జరిగింది. మృతులు జుబేర్ అహమ్మద్ (42) అబ్దుల్ మునీర్ పాషా (16). శనివారం రాత్రి వీరిద్దరు బైక్లో వెళ్తున్నారు, అయ్యప్ప అనే వ్యక్తి మద్యం తాగి కారును నడుపుతూ వేగంగా దూసుకొచ్చి ఢీకొన్నాడు. తీవ్రగాయాలతో ఇద్దరూ చనిపోయాడు. హైగ్రౌండ్స్ ట్రాఫిక్ పోలీసులు స్థలానికి చేరుకొని పరిశీలించారు. కారు డ్రైవర్ అయ్యప్పను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
బైక్ నుంచి పడగానే..
● క్యాంటర్ ఢీ, భర్త మృతి
యశవంతపుర: తుమకూరు జిల్లా కుణిగల్ వద్ద హైవేలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి షరీఫ్ (60) మృతి చెందాడు. ఆయన భార్య హసీనా గాయపడి కుణిగల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇద్దరూ నెలమంగల నుంచి మంగళూరుకు బైకుపై వెళుతుండగా హైవేలో అదుపుతప్పి కిందపడ్డారు. ఈ సమయంలో వెనుక వస్తున్న క్యాంటర్ షరీఫ్పై దూసుకెళ్లడంతో ప్రాణాలు కోల్పోయాడు. కుణిగల్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
బైక్ని ఢీకొన్న క్యాంటర్–ఇద్దరి మృతి
దొడ్డబళ్లాపురం: క్యాంటర్ బైక్ని ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన బెంగళూరు–హైదరాబాద్ రహదారి మార్గంలోని సాదలి క్రాస్లో చోటుచేసుకుంది. చేళూరు నివాసులు నరసింహప్ప(45), నారాయణస్వామి(44)లు బైక్పై వెళ్తుండా సాదలి క్రాస్ వద్ద వేగంగా వచ్చిన క్యాంటర్ ఢీకొంది. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. పేరేసంద్ర పోలీసులు కేసు నమోదు చేశారు.
నిలిచి ఉన్న కంటైనర్కు కారు ఢీ
తల్లీ కూతురు దుర్మరణం
ఉడుపి జిల్లాలో ప్రమాదం


