మైసూరు: కర్ణాటకను మత్తు పదార్థాల రహిత రాష్ట్రంగా మార్చాలన్నది ప్రభుత్వ సంకల్పం అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. ఆదివారం మైసూరులోని కర్ణాటక పోలీస్ అకాడమీలో 46వ బ్యాచ్ 327 మంది సివిల్ ఎస్ఐల పాసింగ్ ఔట్ పరేడ్ ఘనంగా జరిగింది. సీఎం పాల్గొని గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు. మత్తు పదార్థాల తయారీ, విక్రయాలను అరికట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా యువతీ యువకులు పెద్ద సంఖ్యలో మాదకద్రవ్యాలకు బానిసలవుతున్నారని తెలిపారు. మీరు క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వంతో ప్రజలకు సేవ చేయాలి. సమాజంలో పేదలు, మహిళలు, బలహీనులను, న్యాయాన్ని రక్షించడం పోలీసు శాఖ బాధ్యత అని చెప్పారు. ఎంత కష్టమైనా సరే, న్యాయం అందించే విధంగా పోలీసు శాఖ విధులను నిర్వర్తించాలి. న్యాయం అందించడంలో రాజీ పడకూడదు, దురాశకు, ప్రలోభాలకు లొంగరాదు, నిజాయితీగా, విశ్వసనీయంగా పనిచేయాలని సూచించారు. ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, వాటిని నివారించాలని సీఎం తెలిపారు. పోలీసు అధికారులకు ధైర్యం ఉండాలి, మీరందరూ అదే రీతిలో పనిచేయాలని అన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించిన విధంగా 8 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి జి. పరమేశ్వర్, సాంఘిక సంక్షేమ మంత్రి హెచ్.సి. మహదేవప్ప, డీజీపీ సలీం తదితరులు పాల్గొన్నారు.
పేదల కోసం పనిచేయాలి
ఎస్ఐల పాసింగ్ ఔట్ పరేడ్లో సీఎం


