బళ్లారి రూరల్ : ఓటు హక్కును ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలని దావణగెరెలో జాగృతి ర్యాలీని నిర్వహించారు. జిల్లా యంత్రాంగం, జెడ్పీ, జిల్లా పోలీసు యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం దావణగెరె ఏపీఎంసీ రోడ్డులో గణేశ్ హోటల్ నుంచి 13వ క్రాస్ వరకు ర్యాలీ జరిగింది. ఓటు హక్కు విలువ, ఉత్తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి ఓటు హక్కును వినియోగించుకోవాలని నినాదాలు చేశారు. ర్యాలీలో వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
బాటిల్ మందు ఇస్తే.. దిగుతా
● టవర్ పైకెక్కి ఓ మందుబాబు హల్చల్
సాక్షి,బళ్లారి: మద్యం మత్తులో ఓ వ్యక్తి సెల్ టవర్ పైకెక్కి, మద్యం బాటిల్ ఇస్తేనే కిందకు దిగుతానని, లేకపోతే దూకుతానని బెదిరిస్తూ హల్చల్ చేశాడు. విజయపుర జిల్లా తికోటా తాలూకా కోట్యాళ గ్రామానికి చెందిన ఓ మందుబాబు నిత్యం మందు తాగకుండా ముద్ద తినేవాడు కాదు. దీంతో మద్యం మత్తులో శనివారం గ్రామంలోని సెల్ఫోన్ టవర్ పైకెక్కి, పై నుంచి అరుస్తూ మందు బాటిల్ పంపాలని కేకలు వేశాడు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గ్రామస్తులు, పోలీసులు టవర్ వద్దకు చేరుకుని, మందు బాబును సురక్షితంగా కిందకు దింపేందుకు అష్టకష్టాలు పడ్డారు. గతంలో కూడా ఈ వ్యక్తి ఇదే విధంగా సెల్టవర్ పైకెక్కి మందు కోసం హల్చల్ చేశాడని స్థానికులు చెబుతున్నారు.
ఖైదీలకు గుట్కా, సిగరెట్ సరఫరా
● ఇద్దరు జైలు సిబ్బంది, ఆటో డ్రైవర్ అరెస్ట్
హుబ్లీ: ఖైదీలకు గుట్కా, సిగరెట్ అందిస్తున్నారన్న ఆరోపణలపై ధార్వాడ జైల్కు చెందిన ఇద్దరు సిబ్బంది, అలాగే వాటిని తెచ్చి ఇచ్చిన ఆటో డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ కమిషనర్ శశికుమార్ మీడియాతో మాట్లాడుతూ జైలు సిబ్బంది అల్తాఫ్, రాజుతో పాటు ఆటో డ్రైవర్ మహబూబ్నగర్ మునీర్ అహ్మద్ను అరెస్ట్ చేశామన్నారు. వీరి నుంచి రూ.75 వేల విలువ చేసే పొగాకు ఉత్పత్తులతో పాటు ఆటోను కూడా జప్తు చేశామన్నారు. ఈ నెల 8న ఉదయం 3 గంటలకు పెద్ద సంచిని జైల్ దగ్గర పెట్టారు. దాన్ని కొందరు జైల్ లోపలికి తీసుకెళ్లారు. ఘటనపై దర్యాప్తు చేపట్టి కేసు నమోదు చేసుకొని బాధ్యులు జైల్ వార్డెర్లు అని దర్యాప్తులో తెలిసిందన్నారు. ఆటో డ్రైవర్ మునీర్ అహ్మద్ గుట్కా, సిగరెట్ ఉన్న బ్యాగ్ను గేటు ముందు తెచ్చి పెట్టి వెళ్లిన తక్షణమే అల్తాఫ్, రాజు వాటిని లోపలికి తీసుకెళ్లే వారు. వీటిని రెట్టింపు ధరలకు ఖైదీలకు అందించే వారు. నిందితులను జుడీషియల్ కస్టడీకి అప్పగించామన్నారు. జైల్ లోపల గంజాయి, మధ్యం లభించలేదు. గుట్కా, సిగరెట్లను బయట నుంచి ఎవరు అందించే వారో వివరాలు తెలుసుకున్నామని, వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
నలుగురు పోలీసులకు ముఖ్యమంత్రి పతకాలు
హొసపేటె: విజయనగర జిల్లాకు చెందిన నలుగురు పోలీసు అధికారులు, సిబ్బందికి ముఖ్యమంత్రి బంగారు పతకాలు లభించాయి. హరపనహళ్లి డీఎస్పీ డాక్టర్ సంతోష్ చౌహాన్, హూవినహడగలి సీఐ దీపక్ బూసరెడ్డి, టీబీ డ్యాం ఎస్ఐ కోదండపాణి, హరపనహళ్లి స్టేషన్ పోలీస్ కానిస్టేబుల్ ఆనంద్లకు సీఎం బంగారు పతకాలు దక్కాయి. వచ్చే నెల 2న ఈ బంగారు పతకాలను ముఖ్యమంత్రి సిద్దరామయ్య చేతుల మీదుగా అందజేస్తారు.
ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్నా
రాయచూరు రూరల్ : జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలను అరికట్టాలని కర్ణాటక రాష్ట్ర సమితి(కేఆర్ఎస్) నాయకులు డిమాండ్ చేశారు. శనివారం సింధనూరు ఎకై ్సజ్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు నిరుపాది మాట్లాడారు. సింధనూరు తాలూకా కన్నేరి గ్రామంలో అక్రమ మద్యం విక్రయాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ అధికారికి వినతిపత్రం సమర్పించారు.
క్రీడల్లో గెలుపోటములు సహజం
రాయచూరు రూరల్: క్రీడాకారులు క్రీడల్లో గెలుపు, ఓటమిలను సమానంగా స్వీకరించాలని వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ హన్మంతప్ప అభిప్రాయపడ్డారు. శనివారం వ్యవసాయ విశ్వ విద్యాలయం క్రీడా మైదానంలో మూడు రోజుల పాటు జరిగిన క్రీడా పోటీల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రీడాకారులనుద్దేశించి ఆయన మాట్లాడారు. క్రీడలతో మానసికంగా, శారీరకంగా ఎదగడానికి అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో జాగృతి దేశమాన్, సతీష్ కుమార్, రాజణ్ణ, ప్రభురాజ్లున్నారు.


