సాక్షి,బళ్లారి: ప్రియుడి మోజులో పడిన ఓ భార్య వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి సుపారీ ఇచ్చి దారుణంగా చంపించిన ఘటన యాదగిరి జిల్లాలో వెలుగు చూసింది. చామనహళ్లి తాండాకు చెందిన ఆటో డ్రైవర్ అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీని పోలీసులు చేధించారు. భార్య వివాహేతర సంబంధం కారణంగా భర్త హత్యకు గురైనట్లు పోలీసుల విచారణలో తేలింది. వివరాలు.. చామనహళ్లి తాండాకు చెందిన సాగర్ రాథోడ్(35), పూజ భార్యాభర్తలు. కాగా పూజ అదే గ్రామానికి చెందిన రెడ్డి రాథోడ్ అనే వ్యక్తితో మూడేళ్లుగా అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. తమ ఆనందానికి భర్త అడ్డుగా ఉన్నాడని పథకం ప్రకారం హతమార్చేందుకు కుట్ర పన్నారు. ఈక్రమంలో పూజా, ఆమె ప్రియుడు రెడ్డి రాథోడ్ ఇద్దరూ కలిసి మహేష్ అనే వ్యక్తికి రూ.లక్ష సుపారీ ఇచ్చి హత్య చేయాలని సూచించారు. దీంతో ఈనెల 22న పథకం ప్రకారం సాగర్ రాథోడ్ను సుత్తితో కొట్టి మహేష్ హత్య చేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లి కారుతో ఢీకొట్టించి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు చిత్రీకరించారు.
అనుమానంతో పోలీసులు కూపీ లాగగా..
అయితే మృతదేహంపై గాయాలు ఉండటంతో పాటు సుత్తితో తలపై కొట్టినట్లు కూడా ఆనవాళ్లు కనిపించాయి. దీంతో పోలీసులకు అనుమానం రావడంతో పాటు స్థానికులు కూడా వారి అక్రమ సంబంధం గురించి తెలిపారు. ఫోన్ను తీసుకుని కాల్ డేటా వివరాలు సేకరించారు. దీంతో అసలు విషయం బయట పడింది. భార్య పూజాను పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా తామే హత్య చేయించినట్లు అంగీకరించింది. మృతుని భార్యతో పాటు ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరిని యాదగిరి పోలీసులు అరెస్ట్ చేశారు.
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని దారుణ హత్య
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చినట్లు వెలుగులోకి
మృతుడి భార్యతో సహా ముగ్గురు
నిందితుల అరెస్ట్


