సాక్షి,బళ్లారి: మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం సరి కాదని జిల్లా న్యాయసేవల ప్రాధికార సంస్థ అధ్యక్షురాలు, ప్రముఖ న్యాయమూర్తి కేజీ శాంతి పేర్కొన్నారు. ఆమె శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆరోగ్యం ఎంతో ముఖ్యమైందన్నారు. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించేందుకు వీలవుతుందని గుర్తు చేశారు. ఉచిత ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అప్పుడప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఆరోగ్య రక్షణకు సమయం కేటాయించుకోవాలన్నారు. మంచి ఆహారపు అలవాట్లతో పాటు నిత్యం క్రమం తప్పకుండా యోగా, ధ్యానం, వాకింగ్ తదితరాలను దినచర్యలో భాగం చేసుకోవాలన్నారు. న్యాయమూర్తి ప్రమోద్, సీనియర్ సివిల్ జడ్జి రాజేష్, న్యాయమూర్తులు రాఘవేంద్రగౌడ, ఇబ్రహీం, ముదుకప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు.
జిల్లా న్యాయమూర్తి శాంతి


