వైభవంగా రాచోటి శివాచార్య ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

వైభవంగా రాచోటి శివాచార్య ఉత్సవాలు

Mar 24 2026 7:07 AM | Updated on Mar 24 2026 7:07 AM

రాయచూరు రూరల్‌: జిల్లాలోని సిరవార తాలూకా అత్తనూరులో సోమవారం రాచోటి శివాచార్య 22వ వర్థంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. సోమవార పేట హిరేమఠ బృహన్మఠాధిపతి అభినవ రాచోటి వీర శివాచార్యులు ఊరేగింపునకు శ్రీకారం చుట్టి మాట్లాడారు. గ్రామంలో తాగునీటి కోసం బావి, చెరువులు తవ్వించి దాహార్తిని తీర్చారన్నారు. హిందూ సామ్రాజ్య స్థాపనకు నడుం బిగించిన మహా స్వామి రాచోటి శివాచార్య అన్నారు. సామూహిక వివాహాల్లో 25 నవ జంటలకు ఆశీస్సులు పలికారు. శాంతమల్ల శివాచార్య, వీర సంగమేశ్వర, నవలకల్‌ స్వామీజీ, మహంతేష్‌ పాటిల్‌, గిరిజా శంకర్‌, బుడ్డనగౌడ, చంద్రశేఖర్‌లున్నారు.

ఆస్తుల కబ్జాపై కేసులు పెట్టాలి

రాయచూరు రూరల్‌: జిల్లాలోని మాన్వి తాలూకా అరోలిలో ఉన్న మఠం ఆస్తులు కబళించిన వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని దళిత సంఘాల జిల్లా సమితి సంచాలకుడు నరసింహులు డిమాండ్‌ చేశారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అరోలిలో సర్వే నంబర్‌–175లో 16.5 ఎకరాల భూమికి నకిలీ రికార్డులు సృష్టించి భూములను ఆక్రమించారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా ఉరవకొండ గవిమఠం జగద్గురు చెన్నబసవ రాజేంద్ర స్వామీజీకి చెందిన భూములను భీమణ్ణకు గుత్తాధిపత్యం ఇచ్చారన్నారు. సిద్దనగౌడ తండ్రి బసిరెడ్డి, అక్కలు, చెల్లెళ్ల పేరు మీద రిజిస్టర్‌ చేయించుకున్నారన్నారు. మఠం ఆస్తులను కబళించిన, ఆక్రమించిన వారిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలన్నారు. ఆంజనేయ, హనుమేష్‌, మంజునాథ్‌, భీమన్న, రామమూర్తి, జంబయ్య, నాగేంద్ర, సురేష్‌, శ్రీనివాస్‌లున్నారు.

అంగన్‌వాడీ కార్యకర్తలను పర్మినెంట్‌ చేయాలి

రాయచూరు రూరల్‌: అంగన్‌వాడీ కార్యకర్తలను పర్మినెంట్‌ చేయాలని రాష్ట్ర అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం డిమాండ్‌ చేసింది. జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలను బంద్‌ చేిసి సోమవారం బెంగళూరు ఫ్రీడం పార్కులో ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీ్త్రశిశు సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తున్న వారిని పర్మినెంట్‌ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలన్నారు. ఎల్‌కేజీ, యూకేజీ పాఠశాలలను అంగన్‌వాడీలకు కేటాయించాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 60:40 శాతం పద్ధతిలో వేతనాలు పెంచాలని ఒత్తిడి చేశారు.

రిజర్వేషన్లకు

మద్దతివ్వాలని హితవు

రాయచూరు రూరల్‌: రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మహదేవప్పను మాజీ మంత్రి శివనగౌడ నాయక్‌ అవమానించలేదని, రిజర్వేషన్లకు మద్దతు పలకాలని మంత్రికి హితవు పలికారని నాయక్‌ సమాజ సంచాలకుడు రంగనాథ్‌ పేర్కొన్నారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల దావణగెరెలో జరిగిన ఎస్సీ, ఎస్టీ నాయకుల సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ రిజర్వేషన్ల అమలులో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేశారన్నారు. మంత్రి మహదేవప్ప మంత్రివర్గంలో ఉంటూ కాలయాపన చేయకుండా అందరికీ సమ న్యాయం చేయాలని చెప్పడం తప్పా? అని ప్రశ్నించారు. లాలెప్ప నాయక్‌, రవి కుమార్‌, రాజశేఖర్‌, అరుణ్‌, వెంకటేష్‌లున్నారు.

రిజర్వేషన్‌ ఇచ్చేవరకు

నియామకాలు వద్దు

రాయచూరు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేసి, రిజర్వేషన్‌ ప్రకటించే వరకు ప్రభుత్వ కొలువుల్లో నియామకాలకు అవకాశం కల్పించరాదని అంబేడ్కర్‌ పీపుల్స్‌ పార్టీ అధ్యక్షుడు మహేంద్ర కుమార్‌ మిత్ర పేర్కొన్నారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నివేదిక ఆధారంగా రోస్టర్‌ పద్ధతిలో రిజర్వేషన్ల కేటాయింపులు జరుగుతాయని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు 56 శాతం రిజర్వేషన్లు దాటితే ఉద్యోగాల్లో నియామకాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. 1995లో కోర్టు ఆదేశాల జారీ చేసిన 50 శాతం మేరకే ఉద్యోగాలు ఇవ్వాలని, కుల ధ్రువీకరణ పత్రాలను అందించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement