బళ్లారిఅర్బన్: జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరా సమస్య తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో జిల్లా వాణిజ్య పారిశ్రామిక సంస్థ ఆధ్వర్యంలో హోటల్, బేకరీ యజమానుల సంఘం సోమవారం అదనపు జిల్లాధికారికి వినతిపత్రాన్ని అందించారు. అనంతరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు అవ్వారు మంజునాథ్, గౌరవ కార్యదర్శి కేసీ సురేష్బాబు సమక్షంలో హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు విక్రమ్ పోలా తదితరులు మాట్లాడారు. హోటళ్లు, బేకరీలకు అవసరమైన ఎల్పీజీ సిలిండర్ల సరఫరాను పెంచాలని కోరారు. పశ్చిమ ఆసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ఎల్పీజీ సరఫరాలో అంతరాయం ఏర్పడిందన్నారు. దీని ప్రభావం హోటల్, బేకరీ తదితర వ్యాపారాలపై తీవ్రంగా పడిందన్నారు. ఆయా రంగాలపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల జీవనోపాధి దెబ్బ తింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సంయుక్త కార్యదర్శి మర్చేడ్ మల్లికార్జునగౌడ్, సంఘం ప్రతినిధులు, హోటల్ యజమానులు పాల్గొన్నారు.


