బళ్లారి అర్బన్: నగరంలోని ప్రధాన సర్కిల్లో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దళిత సంఘాల నాయకులు జిల్లా యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని కొత్త జిల్లాధికారి కార్యాలయంలో బాబు జగ్జీవన్ రాం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ముందస్తు సన్నాహాలపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. వాల్మీకి సర్కిల్లో వాల్మీకి ప్రతిమను ఏర్పాటు చేసినట్లుగానే ప్రధాన సర్కిల్లో అంబేడ్కర్ ప్రతిమను కూడా ఏర్పాటు చేయాలని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కొందరు మోతీ సర్కిల్ మధ్య భాగంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
తాళూరు రోడ్డు సర్కిల్లో పెట్టండి
మరి కొందరు తాళూరు రోడ్డుకు అంబేడ్కర్ పేరు పెట్టి ఆ సర్కిల్లో అంబేడ్కర్ ప్రతిమను ప్రతిష్టించాలని కోరారు. దీనిపై ప్రతిపాదనలు అందజేస్తే ప్రభుత్వానికి పంపిస్తామని జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. ఏప్రిల్ 5న హరిత విప్లవ నేత బాబూ జగ్జీవన్ రాం జయంతిని కూడా డాక్టర్ జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరంలో నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో ఏడీసీ మహ్మద్ జుబేర్, మున్సిపల్ కమిషనర్ మంజునాథ్, జిల్లా అంబేడ్కర్ సంఘం ప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.


