రాయచూరు రూరల్: మాజీ ఎమ్మెల్సీ, కొప్పళ జెడ్పీ మాజీ అధ్యక్షుడు కరియణ్ణ సంగటి(61) అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున బెంగళూరులోని అపోలో ఆస్పత్రిలో మరణించారు. కొప్పళ తాలూకా యలమగేరిలో మంగళవారం ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు జరుగుతాయి. కరియణ్ణ 1998లో కొప్పళ జిల్లా పంచాయతీ అధ్యక్షుడిగా విధులు నిర్వహించారు. ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణకు ఆప్తుడిగా ఉండడంతో 2000లో ఆయనను ఎమ్మెల్సీగా నియమించారు. 2008లో కొప్పళ నుంచి ఇండిపెండెంట్గా, 2018లో గంగావతి నుంచి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 2023 ఎన్నికల్లో జనార్దనరెడ్డి తరపున ప్రచారం చేసి ఆయన విజయానికి సహకరించారు. ఉమ్మడి రాయచూరు జిల్లాలో 1982 నుంచి సేవాదళ్ కార్యకర్తగా, 1985–89 వరకు కొప్పళ తాలూకా యువజన కాంగ్రెస్ నాయకుడిగా పని చేశారు. కాగా కరియణ్ణ సంగటి మృతదేహానికి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు.
దోపిడీ వ్యవస్థ మార్పే భగత్సింగ్ కల
హొసపేటె: దోపిడీ వ్యవస్థను మార్చి భగత్సింగ్ దేశ ప్రజలకు నూతన సామ్యవాద వ్యవస్థను అందించారని ఏఐడీవైఓ నిర్వాహకుడు మరబ్బిహాళ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం పట్టణంలోని శాంతినికేతన్ ఐటీఐ కళాశాల, గ్రంథాలయం సమీపంలో స్వాతంత్య్ర సమరయోధులు, మహనీయ విప్లవకారులు భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల అమరత్వ దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. స్వాతంత్య్ర సమరయోధులందరూ విప్లవకారులు కారు. పోరాట యోధుల లక్ష్యం భారతదేశం నుంచి బ్రిటిష్ వారిని తొలగించడమేనని అన్నారు. ఏఐడీవైఓ ఆర్గనైజర్ జిల్లా సభ్యుడు ప్రకాష్ బసవనదుర్గ మాట్లాడుతూ నేటి యువత భగత్సింగ్ ఆదర్శాలను అనుసరించాలన్నారు. పోరాట సంఘం నేతలు పాల్గొన్నారు.
రాయచూరు రూరల్: భగత్సింగ్ జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని సంచాలకుడు శరణప్ప పేర్కొన్నారు. ఏఐడీవైఓ, ఏఐడీఎస్ఓ, ఏఐఎంఎస్ఎస్ల ఆధ్వర్యంలో సోమవారం భగత్సింగ్ సర్కిల్ వద్ద భగత్సింగ్ ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. భగత్సింగ్ ఆశలు, ఆశయాలు, ఆదర్శాలను పుణికి పుచ్చుకోవాలన్నారు. ఈ సఽందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. సరోజ, చెన్నబసవ తదితరులున్నారు.
గర్భకోశ క్యాన్సర్
నివారణకు టీకాల పంపిణీ
హుబ్లీ: చిన్నారులు, మహిళలను గర్భకోశ క్యాన్సర్ రూపంలో కబళిస్తున్న సదరు మహ్మమారి కట్టడికి ప్రభుత్వం టీకాల రూపంలో తగిన చర్యలు తీసుకుంటోందని డీఎంహెచ్ఓ డాక్టర్ హొనకేరి తెలిపారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ దేశంలో ఈ వ్యాధి రెండవ స్థానంలో ఉందని, అందువల్ల వ్యాధి కట్టడికి పరిణామాత్మక హెచ్పీవీ టీకా మార్కెట్లో ప్రియం అయినా కూడా ప్రభుత్వం పేద మహిళలందరికీ లభించాలన్న ఉద్దేశంతో తగిన చర్యలు చేపట్టిందన్నారు. 14 నుంచి 15 ఏళ్ల లోపు బాలికలకు ఉచితంగా టీకాలు ఇస్తారన్నారు. ప్రతి బాలికకు సదరు టీకా ఒక్క డోస్ మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం సూచించిందన్నారు. జిల్లా కుటుంబ సంక్షేమ శాఖ ఆరోగ్య శాఖ ఈ మేరకు జిల్లా, తాలూకా, ప్రాథమిక, కమ్యూనిటీ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో టీకాలను అందుబాటులో ఉంచిందన్నారు.


