మూగజీవులను ప్రేమించి..
బొమ్మనహళ్లి: బెంగళూరు శివార్లలోని ఆనేకల్కు చెందిన పశు వైద్యురాలు డా.సమీక్షా రెడ్డి (27)కి కన్నీటితో వీడ్కోలు పలికారు. శుక్రవారం శివమొగ్గలోని త్యావరెకొప్ప పులి–సింహాల జూ పార్క్లో జంతువులకు చికిత్స చేస్తుండగా నీటి ఏనుగు (హిప్పో) దాడి చేయడంతో ఆమె తీవ్ర గాయాలతో కన్నుమూయడం తెలిసిందే. ఆనేకల్ తాలూకాలోని బన్నేర్ఘట్ట సమీపంలోని సకలవారలో శనివారం సాయంత్రం అంతిమ సంస్కారాలు జరిగాయి. సమీక్షారెడ్డి మృతదేహం గ్రామానికి చేరుకోగానే తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు పెట్టుకున్నారు. గ్రామంలో తీవ్ర విషాదం ఆవరించింది. గ్రామస్తులు, అటవీ సిబ్బంది ఆమె భౌతికాకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. తమ ఏకైక కుమార్తెను కోల్పోయిన తల్లిదండ్రులు ధృవకుమార్, శైలజను ఓదార్చడం ఎవరి తరం కాలేదు.
మూగజీవులంటే అమిత ప్రేమ
సమీక్షారెడ్డికి చిన్నప్పటి నుంచే జంతువులు, పక్షులంటే అమితాసక్తి. ఆమె పట్టుదలతో చదివి పశు వైద్యురాలు అయ్యింది. ఆమె ఎంతో ఉత్సాహంతో పశువైద్య కోర్సును పూర్తి చేసి, పశుపక్ష్యాదుల సేవకు అంకితమైందని బంధువులు తెలిపారు. కానీ వాటి సేవలోనే అకాల మరణం చెందడం బాధాకరంగా ఉందని వాపోయారు.
డా.సమీక్షారెడ్డికి కన్నీటి వీడ్కోలు


