అడవుల్లో సఫారీ.. రైతులకు శాపం
మైసూరు: నాగర్హోళె, బండీపుర అభయారణ్యంలో పర్యాటకులు విహరించడానికి సఫారీ సర్వీసులను తిరిగి ప్రారంభించడాన్ని నిరసిస్తూ రైతులు ఉద్యమబాట పట్టారు. గురువారం మైసూరులోని అటవీశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. వందలాదిగా ప్రదర్శనగా వచ్చి ఆఫీసులోకి వెళ్లడానికి యత్నించగా, పోలీసులు వారిని ఆపి గేటును మూసివేశారు. దీనితో పోలీసులు, రైతుల మధ్య కొంతసేపు గలాటా జరిగింది. రైతులు అక్కడే కూర్చుని నినాదాలు చేశారు.
ధనవంతుల ఆనందం కోసమే
రాష్ట్ర రైతు సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు హళ్లికెరె హుండి భాగ్యరాజ్ మాట్లాడుతూ అటవీ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఆ రెండు అడవుల్లో పగటిపూట సఫారీ యాత్రలను అనుమతించినట్లు చెప్పడం సరికాదన్నారు. ఇది రైతులు, వన్యప్రాణులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయమన్నారు. పెట్టుబడిదారులు, ధనవంతులు ఆనందించడానికి మాత్రమే సఫారీలు పనికి వస్తాయన్నారు. సఫారీల వల్ల గాయపడిన జంతువుల కోపం కారణంగా అడవుల్లోని ఊళ్లలో రైతులు, వారి పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన అన్నారు. సఫారీలు మూసివేసిన తరువాత ప్రశాంతత నెలకొందన్నారు. అడవుల్లో జంతువులకు సమస్యలు వస్తాయని, సఫారీ వాహనాలు, అందులోని మనుషుల శబ్ధాల వల్ల జంతువులు భయపడి ఊళ్లలోకి చొరబడతాయని చెప్పారు. స్థానిక రైతులను సంప్రదించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది, ఊళ్లకు, పంటలకు కలిగే నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? అని ప్రశ్నించారు. రైతు నేత కురుబూరు శాంతకుమార్ కూడా సఫారీని బంద్ చేయాలని డిమాండ్ చేశారు.
ఆ విహారయాత్రలను అనుమతించరాదు
మైసూరులో రైతు సంఘాల ముట్టడి


