మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలి
హొసపేటె: ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. శనివారం తహసీల్దార్ నేత్రావతి ద్వారా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి దేవరమనె మహేష్ మాట్లాడుతూ జిల్లాలో మొక్కజొన్న పంట ఎక్కువగా పండుతోందన్నారు. కొనుగోలుదారులు క్వింటాల్ రూ.1500 నుంచి రూ.1700 ధరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని అన్నారు. దీని వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం 2014 నుండి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర చట్టంలో గుర్తింపు లేదన్నారు. దీని వల్ల రైతులకు ఎటువంటి ప్రయోజనం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాన్ని తెరిచి రివాల్వింగ్ ఫండ్ నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం వైపు వేలెత్తి చూపుతోందన్నారు. చక్కెర కర్మాగారాలు మొక్కజొన్నను ఇథనాల్ ఉత్పత్తికి, పెద్ద పౌల్ట్రీ ఫాంలు కోళ్ల దాణా కోసం ఉపయోగిస్తాయి. 40కి పైగా ఉప ఉత్పత్తులు ఇథనాల్ నుంచి ఉత్పత్తి అవుతాయి. దీని వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా రూ.5,000 కోట్ల పన్నులు లభిస్తాయి. ఈ సంవత్సరం రైతులు నిరంతర వర్షాల కారణంగా మొక్కజొన్న పంట దెబ్బతిని చాలా నష్టపోయారన్నారు. అందువల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస మద్దతు ధర చట్టాన్ని అమలు చేయాలి. మద్దతు ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేసే కొనుగోలుదారుపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి. కర్ణాటకలోని మొక్కజొన్న ప్రాసెసింగ్ కంపెనీలు, పెద్ద పౌల్ట్రి ఫాంలు కర్ణాటక రాష్ట్రంలో మొక్కజొన్నను కొనుగోలు చేయాలని ఆయన కోరారు.


