కాలుష్యం గుప్పిట్లో రాజధాని
దొడ్డబళ్లాపురం: ఉద్యాననగరిగా దేశంలో పేరుబడిన బెంగళూరులో స్వచ్ఛమైన గాలి కరువంటే ఆశ్చర్యపోరాదు. కోరలు చాస్తున్న కాలుష్యం మంచి గాలిని మింగేస్తోంది. ఇలా బెంగళూరు నగరం మరో ఢిల్లీగా మారబోతోందా అనే అనుమానాలు క్రమంగా పెరుగుతున్నాయి. బెంగళూరులో రోజురోజుకీ వాయు కాలుష్యం ప్రమాదస్థాయిని చేరుతోంది. ఇటీవల సిలికాన్ సిటీలో పలుచోట్ల వాయు కాలుష్యం మితిమీరిపోతోందని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి లెక్కలు చెబుతున్నాయి.
ఏక్యూఐ హెచ్చరికలు
ఢిల్లీలో వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) బాగా పడిపోయి.. 400 ఏక్యూఐని దాటింది. దీంతో ఢిల్లీ వాసులు స్వచ్ఛమైన గాలి కోసం బెంగళూరు, పూణె తదితర నగరాలకు వలస వెళ్తున్నారు. అయితే ఇప్పుడు బెంగళూరు సిటీ కూడా వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకుంటోంది. ఏక్యూఐ అనేది ఎంత తక్కువగా ఉంటే అంత స్వచ్ఛమైన గాలి ఉన్నట్లు లెక్క.
21 శాతం ఆక్సిజన్ ఉందా?
సాధారణంగా వాతావరణంలో ఆక్సిజన్ 21 శాతం కంటే ఎక్కవ ఉండాలి. బెంగళూరులో ఇటీవల చెట్లు నరికివేయడం, పెరుగుతున్న భారీ కట్టడాల నిర్మాణాలు, విపరీతంగా వాహనాల సంఖ్య తదిరత కారణాల వల్ల ఆక్సిజన్ శాతం అంతకంటే తక్కువగా నమోదవుతోంది. తక్షణమే పరిహార చర్యలు చేపట్టకపోతే బెంగళూరు కూడా త్వరలో రెండో ఢిల్లీగా అవతరిస్తుందని ప్రజలు, పరిసర సంరక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ వాసులు ఆక్సిజన్ కోసం బెంగళూరుకు వలస వస్తున్నట్టు రేపటి రోజు బెంగళూరు వాసులు కూడా ఆక్సిజన్ కోసం మరో నగరాన్ని వెతుక్కుంటూ వెళ్లాల్సిన దుస్థితి రావచ్చు.
నివారణ కావాలి
బెంగళూరులో విరివిగా మొక్కలు నాటాలని, రాజకాలువలను కాపాడి, చెక్ డ్యాంలు నిర్మించి భూగర్భ జలాల స్థాయి పెంచేలా చర్యలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వాహన కాలుష్యాన్ని అరికట్టాలని, ఇంకా అనేక రకాల పరిష్కార చర్యలను చేపట్టాల్సి ఉందని పరిసరవాదులు తెలిపారు.
దుమ్ము ధూళి పాపం
రోడ్లమీద వాహనాలు తిరిగినప్పుడు లేచే దుమ్ము సైతం వాయు కాలుష్యానికి ముఖ్య కారణమవుతోంది. 2022–23లో బెంగళూరులో 1.09 కోట్ల వాహనాలు ఉండగా ఇప్పుడు 1.23 కోట్లకు చేరింది. కేవలం 3.4 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలే ఉన్నాయి. సుమారు 1.50 కోట్ల జన సంఖ్య ఉన్న బెంగళూరులో వాహనాల సంఖ్య పెరుగుతోంది.భారీ ఎత్తైన కట్టడాల నిర్మాణాలు కూడా అధికంగా జరుగుతున్నాయి. రోజుకి సరాసరి 8 చెట్లు నరికివేస్తున్నారు. పలు అభివృద్ధి పనుల సాకుతో బెంగళూరులో గత 5 ఏళ్లలో 12 వేల చెట్లను అధికారికంగా నరికివేశారు. అనధికారికంగా అయితే అంతకు పదింతలు ఎక్కువగానే ఉంటుందని అనుమానాలున్నాయి.
బెంగళూరులో పొగభూతం
మరో ఢిల్లీ అవుతోందన్న భయాలు
స్వచ్ఛమైన గాలి కూడా కరువే
విపరీతమైన వాహనాలతో మరింత మాలిన్యం
చలికాలంలో విజృంభణ
రాష్ట్ర వాయు కాలుష్య నియంత్రణ మండలి (కేపీసీబీ) సమాచారం ప్రకారం సెప్టెంబర్లో బెంగళూరులోని 11 వాయు కాలుష్య మాపన కేంద్రాలు ఉండగా, సిల్క్ బోర్డు, మైసూరు రోడ్డులో 100 ఏక్యూఐ నమోదయింది.
నవంబర్లో చలి తీవ్రత పెరిగినందున బసవేశ్వరనగర, జిగణి పారిశ్రామికవాడ, కస్తూరి నగరలోని వాయు మాపన కేంద్రాల్లో 100, మిగతా చోట్ల 100 దాటుతోంది.
చలి తీవ్ర పెరిగే కొద్దీ వాయు నాణ్యత క్షీణిస్తూ వస్తోంది. దీంతో ప్రజల్లో ఊపిరి తీసుకోవడంలో శ్వాసకోశ సమస్యలు, ఇతర అనారోగ్య లక్షణాలు ఎక్కువవుతున్నాయి.
కాలుష్యం గుప్పిట్లో రాజధాని
కాలుష్యం గుప్పిట్లో రాజధాని


