అమెరికా విమానం.. భూకంప భయం
చిక్కబళ్లాపురం: సిలికాన్ సిటీ బెంగళూరుకు సమీపంలోని చిక్కబళ్లాపురం జిల్లా కేంద్రంతో పాటు పరిసర గ్రామాలలో ప్రచండమైన శబ్ధంతో పాటు భూమి కంపించినట్లయింది. ఇళ్లలోని గిన్నెలు కిందపడ్డాయి, ప్రజలు భూకంపం వచ్చిందేమోనని భీతావహులయ్యారు. ఆకాశంలో కొన్ని క్షణాల పాటు భీకరమైన శబ్ధ ప్రకంపనలు రావడమే దీనికి కారణం. అమెరికాకు చెందిన బి–1బీ లాన్సర్ అనే యుద్ధ విమానం ప్రయాణించడమే ఈ రభసకు మూలమని తెలిసి అందరూ నిర్ఘాంతపోయారు. అమెరికా వాయుసేనకు చెందిన సూపర్సోనిక్ యుద్ధ విమానం లాన్సర్ బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. ఇది చిక్కబళ్లాపురం మీదుగా తక్కువ ఎత్తులో శబ్ధ వేగాన్ని మించి ప్రయాణించడంతో సోనిక్ బూం ఏర్పడి భూకంపం తరహా అనుభవం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.
ఏదో కూలిపోయింది అనుకున్నాం
చిక్కబళ్లాపురం తాలూకా పరిధిలోని ఆరూరు, ఆవలనాగేనహళ్లి, చిక్కబైలగుర్కి, తుమకలహళ్లి తదితర గ్రామాలలో సోనిక్ బూం ప్రభావం కనిపించింది. పేరేసంద్ర గ్రామ రైతు మంజునాథ్ పొలం పనిలో ఉండగా శబ్ధం వచ్చిందని, భయంతో కదలకుండా కూర్చున్నట్లు తెలిపాడు.
మరో యువకుడు మాట్లాడుతూ ఆ శబ్ధానికి మా ఇంటిలోని పాత్రలు పడిపోయాయి, బయటకు వచ్చి చూసేసరికి ఏమీ కనబడలేదు, ఎక్కడో విమానం లేదా హెలికాప్టర్ పడిపోయి ఉండాలి అనుకొన్నాం అని చెప్పాడు. చాలామంది పేరేసంద్ర పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాలలో పరిశీలించి ఏ ప్రమాదం జరగలేదని చెప్పారు. చివరకు కెంపేగౌడ ఎయిర్పోర్టుకు ఫోన్ చేయగా, బి–1బి లాన్సర్ బాంబర్ ఎయిర్పోర్టులో క్షేమంగా దిగిందని సమాచారమిచ్చారు. యుద్ధ విన్యాసాల్లో పాల్గొనడానికి ఈ లాన్సర్ వచ్చినట్లు తెలిసింది.
బెంగళూరు వద్ద గందరగోళం
సోనిక్ బూం ఏర్పడి ప్రకంపనలు
అమెరికా విమానం.. భూకంప భయం


