రబీకి నీరందించాలని రైతుల కదం
సాక్షి,బళ్లారి: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిధిలో పలు జిల్లాలకు తాగు, సాగునీరందించే తుంగభద్ర జలాశయంలో రబీ పంటకు సరిపడేంత నీరు ఉన్నా గేట్లు మార్చాలనే సాకుతో రబీ సీజన్లో పంటలకు నీరు ఇవ్వకపోతే సహించేది లేదని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కర్ణాటక ప్రాంత రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు పాదయాత్రలో పాల్గొని ఆందోళన చేపట్టారు. సిరుగుప్ప తాలూకా కరూరు గ్రామం నుంచి తుంగభద్ర డ్యాం వరకు చేపట్టిన రైతుల పాదయాత్రకు జనం దారి పొడవునా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ రైతులకు బాసటగా నిలిచారు. రైతు సంఘం అధ్యక్షుడు మాధవరెడ్డి మాట్లాడుతూ తుంగభద్ర ఆయకట్టు పరిధిలో రైతులు వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్నారన్నారు. రైతులకు ఖరీఫ్లో సాగు చేసిన వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటలకు భారీ వర్షాల వల్ల నష్టం వాటిల్లిందన్నారు. రబీ సీజన్లోనైనా పంటలను పండించుకుందామని ఆశించిన రైతులకు డ్యాంలో గేట్ల మరమ్మతు పేరుతో రబీకి నీరు ఇవ్వలేమని ప్రకటించిన పాలకులు, ఏ ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని మండిపడ్డారు.
14వ తేదీన నీరు ఇస్తామని ప్రకటించాలి
గత ఏడాది నవంబర్లో 19వ గేటు కొట్టుకు పోయిందని గుర్తు చేశారు. నిపుణుల సహాయంతో తాత్కాలికంగా స్టాప్లాగ్ గేటు అమర్చారన్నారు. అన్ని గేట్లు మార్చాలని నిపుణులు సూచించి ఏడాది దాటి పోయిందన్నారు. నూతన గేట్లు తయారు చేయడానికి మూడు రాష్ట్రాలకు చెందిన పాలకులు మీనమేషాలు లెక్కించారని, సవతి తల్లి ధోరణి అవలంభించడంతో రైతులకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్యాంలో 33 గేట్లు ఉండగా, ప్రస్తుతం ఏడాది నుంచి 14 గేట్లను మాత్రమే తయారు చేశారని, మిగిలిన 19 గేట్లను ఎప్పుడు తయారు చేస్తారో వారికే తెలియడం లేదన్నారు. ఈ నేపథ్యంలో గేట్లు మార్చాలనే ఉద్దేశ్యంతో ఏకంగా రబీ పంటకు నీరు నిలుపుదల చేస్తామంటున్నారన్నారు. రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈనెల 14వ తేదీన బెంగళూరులో మళ్లీ నీటిపారుదల సలహా సమితి(ఐసీసీ) సమావేశం నిర్వహిస్తున్నారన్నారు. ఆ సమావేశంలో సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సరైన నిర్ణయం తీసుకుని, రబీకి నీరు అందించేందుకు తగిన దిశానిర్దేశం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్నారు.
దారి పొడవునా రైతులకు స్వాగతం
పలుకుతున్న జనం
కరూరు నుంచి రైతు సంఘం
ఆధ్వర్యంలో పాదయాత్ర
రబీ పంటకు నీరు ఇవ్వకపోతే ఖబడ్దార్ అంటున్న వైనం
హొసపేటె తుంగభద్ర డ్యాం వరకు పాదయాత్ర
కరూరు నుంచి చేపట్టిన పాదయాత్ర హొసపేటె సమీపంలోని తుంగభద్ర డ్యాం వరకు కొనసాగుతుందన్నారు. ఈనెల 17వ తేదీన డ్యాం వద్ద పెద్ద ఎత్తున రైతులు సమావేశం నిర్వహించి రైతుల సమస్యలపై చర్చిస్తామన్నారు. ఆలోపు పాలకులు రబీలో కచ్చితంగా నీరు ఇస్తామని ప్రకటించాలని మనవి చేశారు. రైతులు సమస్యలు పాలకులకు ఏమాత్రం పట్టడం లేదన్నారు. అవగాహన లేని మంత్రి శివరాజ్ తంగడిగి నీటిసారుదల సలహా సమితి అధ్యక్షుడుగా కొనసాగుతున్నారన్నారు. ఆయనకు ఈ ప్రాంత రైతుల సమస్యలు ఏమాత్రం పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయకట్టు రైతులు ముక్తకంఠంతో రబీకి నీరు ఇవ్వాలని కోరుతున్నారన్నారు. రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని పాలకులు తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈసందర్భంగా కర్ణాటక ప్రాంత రైతు సంఘం, హసిరుసేనె నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రబీకి నీరందించాలని రైతుల కదం


