బస్సు భళా
తుమకూరు: కన్నడపై ఉన్న అమితమైన ప్రేమతో తమ బస్సును ఎంతో అందంగా కర్ణాటక గొప్పదనాన్ని చాటిచెప్పేలా ముస్తాబు చేశారు. కన్నడ రాజ్యోత్సవం సందర్భంగా హీరేకరూరు నుంచి బెంగళూరుకు వెళ్లే వాయువ్య కర్ణాటక ఆర్టీసీ బస్సును డ్రైవర్ అశోక్, కండక్టర్ శశికుమార్ భోస్లే ఎరుపు, పసుపు రంగులతో కన్నడ అక్షరాలతో తీర్చిదిద్దారు. రాష్ట్ర మాత, చిత్రపటం, ఎల్ఈడీ దీపాలతో విద్యుదీపాలంకరణ చేశారు. సాహితీవేత్తలు, జైన తీర్థంకరులు, చలనచిత్ర నటులు తదితర గొప్పవారి ఫోటోలను కూడా బస్సులో ఉంచారు. హీరేకరూరు డిపోకు చెందిన ఈ బస్సు సొరబ నుంచి బెంగళూరుకు ప్రయాణిస్తుంది. నవంబర్ ముగిసేవరకు అలంకరణను కొనసాగిస్తామని తెలిపారు.
మాలూరులో మార్పు లేనట్టే?
● ముగిసిన రీకౌంటింగ్
కోలారు: కుతూహలం కలిగించిన మాలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల రీకౌంటింగ్ మంగళవారం రాత్రి 9.30 గంటలకు ముగిసింది. అప్పుడు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కైవె నంజేగౌడ రీకౌంటింగ్లో లాంటి వ్యత్యాసం కనిపించలేదని, తనకు న్యాయం దొరికిందని చెప్పడం గమనార్హం. గత ఎన్నికలలో ఈయన సుమారు 250 ఓట్ల మెజారిటీతో గెలిచారు. దానిని బీజేపీ అభ్యర్థి మంజునాథ్గౌడ సవాల్ చేశారు. ప్రత్యర్థి వెనుకబడ్డాడని, సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఫలితాలను సీల్డ్ కవర్లో ఉంచి సుప్రీంకోర్టుకు పంపిస్తారు. ఈ నెల 24 న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మంజునాథ్ గౌడ మాట్లాడుతూ రీకౌంటింగ్లో తమ అనుమానాలు నివృత్తి కాలేదని అసంతృప్తితో చెప్పారు. సుప్రీంకోర్టులోనే ప్రశ్నిస్తామని తెలిపారు.
శౌర్య ప్రతీక ఓబవ్వ
తుమకూరు: ధైర్యం, దేశభక్తి, మహిళ శౌర్యానికి ప్రతీక ఒనకే ఓబవ్వ అని జిల్లాధికారి శుభకళ్యాణ్ అన్నారు. నగరంలోని డాక్టర్ గుబ్బి వీరణ్ణ కళాక్షేత్రంలో జిల్లా పాలన విభాగం ఆధ్వర్యంలో ఓబవ్వ జయంతిని నిర్వహించారు. జిల్లాధికారి మాట్లాడుతూ ఓబవ్వ త్యాగం, సాహసం ఇప్పటి తరానికి స్ఫూర్తి అని, సమాజంలో మహిళల గౌరవం, శక్తిని ప్రతిబింబిస్తుందని కొనియాడారు. స్వాభిమానంతో శత్రువులపై పోరాడి అమరులైన గొప్ప నాయకురాలు ఓబవ్వ అని ప్రశంసించారు. ఈ సందర్భంగా పలు రంగాలకు చెందిన సీ్త్ర, పురుషులను సన్మానించారు.
ధర్మస్థల సిట్కు ఊరట
శివాజీనగర: ధర్మస్థలలో వందలాది మృతదేహాలను పూడ్చారన్న కేసులో సిట్ దర్యాప్తుపై ఉన్న మధ్యంతర స్టేను హైకోర్టు రద్దు చేసింది. కుట్ర జరిపిన ఆరోపణలు ఎదుర్కొంటున్న విఠలగౌడ, గిరీశ్ మట్టణ్ణవర్, మహేశ్ తిమరోడి, టీ.జయంత్లు సిట్ విచారణకు హాజరుకావాల్సి ఉంది. ధర్మస్థల పోలీస్ స్టేషన్లో తమపై నమోదైన కేసులను కొట్టివేయాలని వీరు హైకోర్టును ఆశ్రయించారు. వాద ప్రతివాదనలను ఆలకించిన జడ్జి పీ.ఎం.నవాజ్ గతంలో ఉన్న స్టేను తొలగిస్తున్నట్లు ఆదేశించారు. దీంతో సిట్ మళ్లీ దూకుడుగా దర్యాప్తును ప్రారంభించే అవకాశం ఉంది.
కుక్కే సుబ్రహ్మణ్య సేవలో నయనతార
బనశంకరి: బహుభాషా నటి నయనతార, ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ బుధవారం దక్షిణ కన్నడ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కుక్కే సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సర్పదోష నివారణ పూజలు చేశారు. వేద పండితులు పాల్గొన్నారు. దేవస్థాన సిబ్బంది వారికి ఏర్పాట్లు చేసి దర్శనాలు చేయించారు. ఆలయ కమిటీ సభ్యులు నయనతార దంపతులను సన్మానించి జ్ఞాపిక అందజేశారు. నయనతార వెంట కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు నయన్ దంపతులతో సెల్ఫీలు, పోటోలు తీసుకున్నారు.
బస్సు భళా
బస్సు భళా


