పటిష్ట బందోబస్తు మధ్య ‘మాలూరు’ ఓట్ల లెక్కింపు
కోలారు: మాలూరు విధానసభ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం పటిష్ట బందోబస్తు మధ్య జరిగింది. నగర శివార్లలోని ఉద్యాన మహావిద్యాలయంలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి రౌండ్ నాలుగు టేబుళ్లలో పోస్టల్ ఓట్లను లెక్కించారు. 14 టేబుళ్లలో ఈవీఎం ఓట్ల లెక్కింపు జరిగింది. లెక్కింపు కేంద్రం నుంచి కిలమీటర్ దూరం వరకు నిషేధాజ్ఞలను అమలు చేశారు. ఏజెంట్లను మినహాయించి ఇతరులను లోపలకు అనుమతించలేదు. ఎమ్మెల్యే కేవై నంజేగౌడ, ప్రత్యర్థి కేఎస్ మంజునాథ గౌడ, హుడీ విజయకుమార్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కేంద్రంలో ఉన్నారు. మొత్తం 18 రౌండ్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగింది. ఈవీఎం ఓట్లను లెక్కించిన తర్వాత ప్రత్యర్థులు వీవీ ప్యాట్లను కూడా లెక్కించాలని మనవి చేశారు. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు ఆలస్యంగా సాగింది. మధ్యాహ్నం సమయానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగుస్తుందని అంతా అనుకున్నప్పటికీ సాయంత్రం వరకు సాగింది. లెక్కింపు ముగిసిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలనుసారం ప్రకటించలేదు. ఇదిలా ఉండగా కౌంటింగ్కు మునుపెన్నడూ లేనంతగా భద్రతను కల్పించారు. బెంగళూరు–తిరుపతి రహదారి సర్వీసు రోడ్డు పొడవునా బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను నిలిపేశారు. జిల్లా ఎస్పీ నిఖిల్.బి నేతృత్వంలోని అదనపు ఎస్పీ రవిశంకర్, జగదీశ్, డీవైఎస్పీలు నాగై, మనీషా, సీఐలు, వివిధ పోలీసు స్టేషన్ సీఐలు, ఎస్ఐలు బందోబస్తులో పాల్గొన్నారు. ఏం జరుగుతుందో చూడాలని ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
అభ్యర్థులకు మాత్రమే లోపలకు అనుమతి
సీల్డ్ కవర్లో ఫలితాలు భద్రం
పటిష్ట బందోబస్తు మధ్య ‘మాలూరు’ ఓట్ల లెక్కింపు


