దత్త పుత్రిక దారుణం
● ఆస్తి కోసం పెంపుడు తల్లి హత్య
యశవంతపుర: ఆస్తి కోసం తల్లిని పెంపుడు కూతురు హత్య చేసిన ఘటన చిక్కమగళూరు జిల్లా ఎన్ఆర్పుర తాలూకా బాళెహొన్నూరు సమీపంలోని బండిమఠం గ్రామంలో జరిగింది. వివరాలు.. కుసుమ (62) అనే మహిళ సుధా (35) అనే మహిళను గతంలో దత్తత తీసుకుంది. హావేరి జిల్లాకు చెందిన కుసుమ చాలా ఏళ్ల క్రితం బాళెహొన్నూరుకు వెళ్లి కాఫీతోటలో పని చేస్తూ అక్కడే నివాసం ఉంటుంది. బిడ్డలు లేని కారణంగా చెల్లెలు కూతురు సుధని చిప్పప్పుడే తెచ్చుకొని పెంచి పెద్ద పెళ్లి కూడా చేసింది. హావేరిలో కుసుమకు ఎకరన్నర భూమి, ఇల్లు ఉంది. దీని మీద సుధా కన్ను పడింది. త్వరగా ఆస్తి దక్కాలంటే ఏదో ఒకటి చేయాలనుకుంది. సోమవారం రాత్రి కుసుమ నిద్రలో ఉండగా నోటిలో బట్టలు కుక్కి ఊపిరాడకుండా చేసి గొంతు పిసికి ప్రాణాలు తీసింది. ఆపై మామూలుగానే నిద్రపోయింది. మంగళవారం ఉదయమే లేచి తన పెంపుడు తల్లి నిద్రలోనే చనిపోయిందని అందరికీ చెప్పింది. బాళెహొన్నూరు పోలీసులు చేరుకుని సుధాను అరెస్ట్ చేసి విచారించగా అసలు విషయం చెప్పింది.
పేలుళ్లకు బాధ్యత వహిస్తారా?
● బీజేపీకి మంత్రి లాడ్ ప్రశ్న
మండ్య: దేశ భద్రత విషయంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వంగా కట్టుబడి ఉంటామని కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ పేర్కొన్నారు. మండ్యలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జైళ్లలో ఖైదీలకు రాచమర్యాదల అంశంపై బదులిస్తూ సమర్థ అధికారులను నియమించి ఇలాంటి పోకడలకు చెక్ పెట్టాలన్నారు. ఎక్కడో ఒక చోట జరిగినంత మాత్రాన ప్రభుత్వాన్ని దూషించడం సబబా? అన్నారు. అలా అయితే ఢిల్లీలో బాంబు పేలుళ్లకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా? సిద్దరామయ్య రాజీనామా కోరేవారు మోదీ రాజీనామాను డిమాండ్ చేస్తారా? అన్నారు. బెంగళూరు ఎయిర్పోర్టులో నమాజ్ గురించి ప్రస్తావిస్తూ, విమానాశ్రయాల నిర్వహణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. అక్కడ నమాజ్ చేయడానికి అనుమతి ఇచ్చింది ఎవరు? అని ఆయన ప్రశ్నించారు.
మోదీపై విమర్శలు
భవిష్యత్తులో నితిన్ గడ్కరీ ప్రధాని అవుతారనే భయం బీజేపీ వారిని వేధిస్తోందన్నారు. ఇప్పుడు మోదీ సినిమా ముగుస్తోందని హేళన చేశారు. శ్రీరాముని కన్నా మోదీనే పెద్దవాడని బీజేపీ వారు ప్రతిబింబించారన్నారు. రాముడు చేయి పట్టుకుని మోదీ పిలుచుకెళతారు, రామునికి దారి తెలియదా? అని మంత్రి బీజేపీ తీరును ఎద్దేవా చేశారు.


