వృద్ధుల కోసం 1090 సహాయవాణి
బళ్లారి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వృద్ధుల సంక్షేమం, వారి మేలు కోసం 1090 అనే ఫోన్ నెంబర్లో సహాయవాణి నిరంతరం సేవలు అందిస్తోంది. కురుగోడుకు చెందిన ఎన్జీఓ వ్యవస్థాపకులు, రిటైర్డ్ పోలీస్ ఉద్యోగి ఉమాపతి గౌడ్రు ఈ సహాయవాణి సూత్రధారి. అవ్వా తాతలు తమకు సంబంధించి ఏ సమస్యనైనా టోల్ ఫ్రీ నెంబర్ 1090కు తెలియజేస్తే తక్షణమే తమ ప్రతినిధులను అక్కడకు పంపి అన్ని సహాయ చర్యలు తీసుకుంటామన్నారు. ఇది నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో ఆవరణలో కూడా ఉందని, పిల్లలు లేక కోడలు, ఇరుగుపొరుగు వారు బంధువులు, ఇతరత్ర వృద్ధులు ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలని ఆయన కోరారు. వృద్ధుల కోసం నెహ్రు కాలనీలో వృద్ధుల పగటి యోగక్షేమ కేంద్రాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఎవరైనా వృద్ధులైన అవ్వా తాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని ఆయన కోరారు.
ఎడమ కాలువకు నీరందించండి
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువకు సాగు నీటిని విడుదల చేయాలని తుంగభద్ర ఎడమ కాలువ పోరాట సమితి నేతలు డిమాండ్ చేశారు. సోమవారం మాన్వి తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు శంకరగౌడ మాట్లాడారు. ఈ విషయంలో ఇంజినీర్లు సక్రమంగా కాలువలపై నీటి నిర్వహణ చేపట్టాలని ఒత్తిడి చేశారు.
ఆయుర్వేద కౌశల్య
శిక్షణా శిబిరం
రాయచూరు రూరల్: నగరంలో ఆయుర్వేద ఉచిత కౌశల్య శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు. పూర్ణిమ ఆయుర్వేద వైద్య కళాశాల ఆధ్వర్యంలో సాయి మందిరంలో సాయి కిరణ్ ప్రారంభించి మాట్లాడారు. వనమూలికల ద్వారా 250 ఔషధ మొక్కలను నాటి ఉత్తమ ఆరోగ్య సేవలను అందించడం అభినందనీయమన్నారు. పంచకర్మ వివిధ రకాలైన వ్యాధులకు చికిత్స చేయడంతో పాటు అన్ని విధాలైన సౌకర్యాలను సమకూర్చడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులో ఆయుర్వేదం ద్వారానే అన్ని రోగాలకు మందులు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో కేశవరెడ్డి, శివ కుమార్, ఆయుష్ అధికారి శంకరగౌడ, మహేశ్వర స్వామి, పూర్ణిమ, ఆయుర్వేద వైద్య కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ రెడ్డి, వైద్యులు నందా, అంబిక, ప్రత్యూష, బసవరాజ్లున్నారు.
సామాజిక స్పృహతో
దివ్యాంగులు, వృద్ధులకు విశిష్ట సేవలు
హుబ్లీ: నగరంలోని బసవ శ్రీ అనే ఆశ్రమ నిర్వాహకులు ప్రకాష్ వృద్ధులు, బుద్ధిమాంధ్యులకు ప్రత్యేకంగా హుబ్లీలోని రాజేంద్ర నగర్, చైతన్య నగర్, డాలర్స్ కాలనీ సమీపంలో సదరు ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఆశ్రమంలో వృద్ధులను, దివ్యాంగులను చూసుకోవడానికి భారం లేక వీరి ఆలన, పాలన చూసేందుకు మనుషులు కరువైన వారు తమను బసవశ్రీ ఆశ్రమాన్ని సంప్రదిస్తే వారి ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా సేవలు అందించేందుకు తాను, తమ సిబ్బంది సిద్ధమని ఆశ్రమ నిర్వాహకులు, మానవత మమతల కోసం తపిస్తున్న ప్రకాష్ తెలిపారు. తమ బసవ శ్రీ ఆశ్రమంలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. తాను సామాజిక స్పృహ కలవాడినని, ఎంతో కొంత సొంత లాభం మానుకొని పొరుగు వారికి సాయపడవోయ్ అన్న గురుజాడ అప్పారావు మాటలకు అనుగుణంగా ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నానన్నారు. అవసరమైన వారు లేక తమ ఇంట్లో వృద్ధులను, బుద్ధిమాంధ్యులను చూసేందుకు కుటుంబ సభ్యులు లేకపోవడం, ఆర్థిక భారం తదితర సమస్యలతో బాధపడే వారికి తమ ఆశ్రమంలో అన్ని వసతులు కల్పించి ఆర్థిక స్థితిగతులను బట్టి ధర్మమైన ఫీజులను వసూలు చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని జంట నగరాలు, జిల్లా ప్రజలు, తదితరులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


