విద్యుత్ స్తంభాన్ని ఆనుకున్న బస్సు
హొసపేటె: హులిగి నుంచి అంజనాద్రి మీదుగా గంగావతి వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఆనుకొన్న ఘటన అంజనాద్రి కొండ సమీపంలో శనివారం జరిగింది. అయితే బస్సులో ఉన్న 20 మందికి పైగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కొప్పళ తాలూకాలోని హిరేసింధోగి నివాసి శివమ్మ అనే మహిళ బస్సు కిటికీలో నుంచి చేయి బయటకు పెట్టి కూర్చుని ఉండగా, ఆమె వేలు తెగిపోయింది. దీంతో ఆమెను ఆనెగుంది గ్రామంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అంజనాద్రి కొండ దగ్గర అడవిలోకి వెళ్లే రోడ్డు ఇరుకుగా, వంకర టింకరగా మలుపులు తిరిగి ఉంది. బస్సు అక్కడకు చేరుకుంటుండగా, ఒక కారు ముందు నుంచి వేగంగా వచ్చింది. కారును తప్పించబోయిన డ్రైవర్ అమరేగౌడ వాహనాన్ని ఎడమ వైపునకు తిప్పాడు. దీంతో రోడ్డు పక్కన వంపులో ఉన్న ఒక విద్యుత్ స్తంభాన్ని బస్సు ఎడమ వైపు భాగం ఆనుకొంది. డ్రైవర్ సకాలంలో స్పందించడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. కాగా గంగావతి రూరల్ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
20 మంది ప్రయాణికులు క్షేమం
త్రుటిలో తప్పిన ప్రాణాపాయం


