
‘అక్రమ లేఔట్లకు విద్యుత్ సౌకర్యం ఇవ్వొద్దు’
రాయచూరు రూరల్: అక్రమంగా ఏర్పాటు చేసుకున్న లేఔట్లకు విద్యుత్ సౌకర్యం కల్పించడం తగదని సీపీఎంఎల్ లిబరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం యరగేర జెస్కాం కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు మహ్మద్ హనీఫ్ మాట్లాడారు. రాయచూరు తాలుకా యరగేర సర్వే నంబర్ 149లో అక్రమంగా లేఔట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఈ లేఔట్లలో నిర్మించుకున్న ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించొద్దని కోరారు. స్థానిక అధికారి ద్వారా జెస్కాం ఎండీకి వినతిపత్రం పంపించారు.
క్యాన్సర్ కేంద్రాల
ఏర్పాటుకు చర్యలు
రాయచూరు రూరల్: రాష్ట్రంలోని ఐదు జిల్లాలో క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్యకీయ శాఖ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ వెల్లడించారు. గురువారం సాయంత్రం బెంగళూరు కిద్వాయ్ ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర పరిధిలో రాయచూరు, బళ్లారి, శివమెగ్గ, బీదర్, బెళగావిలో క్యాన్సర్ చికిత్సల కోసం క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. భవిష్యత్తులో తుమకూరు, మండ్య, మైసూరు, కారవారల్లో బాహ్య క్యాన్సర్ (పీసీసీ) కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. కలబుర్గిలో 80 పడకల క్యాన్సర్ ఆస్పత్రిని 210 పడకల ఆస్పత్రిగా మార్చడం జరుగుతుందన్నారు. కిద్వాయ్ ఆస్పత్రిలో 720 పడకలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.
మానసిక ఆరోగ్యమే మహాభాగ్యం
బళ్లారి రూరల్: వైద్య విద్యార్థులు, జూనియర్ వైద్యులు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని బీఎంసీఆర్సీ డీన్ అండ్ డైరెక్టర్ డాక్టర్ గంగాధర గౌడ తెలిపారు. శుక్రవారం సైకాట్రీ విభాగంలో వరల్డ్ మెంటల్ హెల్త్డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా సానుకూలంగా క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. సైకాట్రీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ కొట్రేశ్ మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా మహాభాగ్యమే అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ మంజునాథ్, చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ గడ్డిదివాకర్, సైకాట్రిస్ట్ డాక్టర్ ఖాజామొయినుద్దీన్, తదితర వైద్యులు పాల్గొన్నారు.
యోగా, ధ్యానంతో ఒత్తిడి దూరం
బళ్లారి టౌన్: మానసిక ఒత్తిడి నుంచి బయట పడేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామం అలవాటు చేసుకోవాలని జిల్లా న్యాయసేవా ప్రాధికారం సభ్యుడు, న్యాయమూర్తి రాజేష్ హొసమని సూచించారు. జిల్లా పాలన, జిల్లా పంచాయతీ, న్యాయ సేవ ఆధ్వర్యంలో శుక్రవారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానసిక ఒత్తిడి అనేది దౌర్భల్యం కాదన్నారు. ఊహ, ఎక్కువగా ఆలోచనలు చేయడం వల్ల అవే మానసిక రుగ్మతలు వస్తాయని పేర్కొన్నారు. జిల్లా వైద్యుడు బసారెడ్డి మాట్లాడుతూ.. మానసిక ఒత్తిడికి గురైన వారు దైహిక, మానసిక, ఆర్థిక, సామాజిక, ఆత్మహత్య ఆలోచనల నుంచి మనస్సును నియంత్రణలో ఉంచుకోవాలని సూచించారు. అనవసర విషయాలపై చర్చించుకోకపోవడం ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో వైద్య నిపుణులు డాక్టర్ కిశోర్, వీరేంద్ర కుమార్, స్థానిక ప్రిన్సిపాల్ సతీష్ పాల్గొన్నారు.
కాంట్రాక్టర్ కిడ్నాప్ కేసులో
10 మంది అరెస్ట్
హుబ్లీ: నగరానికి చెందిన కాంట్రాక్టర్ మోహన్ చౌహాన్ కిడ్నాప్ కేసులో 10 మంది నిందితులను అరెస్ట్ చేశామని నగర పోలీసు కమిషనర్ శశికుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. హుబ్లీ, గోకుల రోడ్డు పోలీసు స్టేషన్ పరిధిలో కాంట్రాక్టర్ మోహన్ చౌహాన్ను బసప్ప దళవాయితో పాటు 15 మంది కలిసి మారణాయుదాలతో దాడి చేసి హత్య చేశారని పేర్కొన్నారు. కేసుకు సంబంధించి పూర్వాపరాలు సేకరించడం జరిగిందన్నారు. ఈ హత్యతో సంబంధం ఉన్న 10 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు.
పంట నష్టంపై జాబితా సిద్ధం
హుబ్లీ: ఈ ఏడాది ఆగస్టులో జిల్లాలో అతివృష్టితో దెబ్బతిన్న పంటలకు సంబంధించి పరిహారం చెల్లించేందుకు సర్వే చేపట్టారు. రైతుల నుంచి అభ్యంతరాల స్వీకరణ అనంతరం సెప్టెంబర్ 7వ తేదీన పంట నష్టంపై తుది జాబితా రూపొందించారు. తాలూకాల వారీగా రైతులకు ఎంతెంత పరిహారం అందుతుందన్న దానిపై కూడా వివరాలు అందజేసినట్లు అధికారులు తెలిపారు.

‘అక్రమ లేఔట్లకు విద్యుత్ సౌకర్యం ఇవ్వొద్దు’

‘అక్రమ లేఔట్లకు విద్యుత్ సౌకర్యం ఇవ్వొద్దు’