
ఈడీ మెరుపు దాడి
సాక్షి, బళ్లారి: కర్ణాటక మహిర్షి వాల్మీకి గిరిజన అభివృద్ధి మండలి కోట్లాది రూపాయల కుంభకోణంలో ఈడీ మరోసారి రంగంలోకి దిగింది. బళ్లారి ఎంపీ తుకారాంను బుధవారం ఉదయం ఆకస్మికంగా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని తీవ్ర విచారణ చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈడీ అధికారులు 8 బృందాలగా ఏర్పడి ఉమ్మడి బళ్లారి జిల్లాల పరిధిలో కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లు, ఆఫీసుల్లో ముమ్మరంగా సోదాలు సాగించారు. బళ్లారి నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డికి ఇంట్లోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. బళ్లారి నెహ్రు కాలనీలోని ఆయన నివాసంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు గాలింపు జరిగింది. అనేక పత్రాలు, కంప్యూటర్లు ఇతరత్రా సామగ్రిని స్వాధీనం చేసుకుని శోధించారు. ఎమ్మెల్యే భరత్రెడ్డి అక్కడే ఉన్నారు. ఈడీ అధికారులు ఇంటి గేట్లు, తలుపులు వేసి పకడ్బందీగా సోదాలు చేయడం గమనార్హం. ఎవరినీ లోపలికి రానివ్వలేదు.
ల్యాప్టాప్లు స్వాధీనం
సండూరులో ఎంపీ తుకారాం ఇల్లు, ఆఫీసులో ఏకకాలంలో సోదాలు చేశారు. ఆయనను అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. కూడ్లిగి ఎమ్మెల్యే శ్రీనివాస్ ఇంటికి రెండు కార్లలో ఈడీ అధికారులు, పోలీసులు, మహిళా పోలీసులు వచ్చి గాలింపు ప్రారంభించారు. అందరి ఇళ్లలో సోదాలు చేసి పలు రికార్డులు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. బళ్లారి రూరల్ ఎమ్మెల్యే నాగేంద్ర ఆప్త సహాయకుడు గోవర్దన్రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేశారు.
దాడులపై ఆగ్రహం
ఈడీ దాడులను కాంగ్రెస్ నాయకులు ఖండించారు. రాజకీయ కక్ష సాధింపుతో ఈడీని ప్రయోగించారని ఆరోపించారు. పలువురు కార్పొరేటర్లు ఎమ్మెల్యే ఇంటివద్దకు వచ్చారు. బీజేపీ దుష్ట రాజకీయాలు చేస్తోందన్నారు. ఏటా ఒకసారి ఈడీతో దాడులు చేయిస్తున్నారని, బీజేపీ నాయకుల ఇళ్లలో ఎందుకు సోదాలు చేయరని ప్రశ్నించారు. ఈడీ ఆకస్మిక దాడులు అధికార పార్టీలో గుబులు పుట్టించాయి. ఎప్పుడు తమ ఇంటి తలుపు తడతారో అనే ఆందోళన పలువురు ప్రజాప్రతినిధుల్లో నెలకొంది.
హఠాత్తుగా ఎమ్మెల్యే ఇంటిపై..
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్టి శ్రీనివాస్ ఇంటిలో ఈడీ సోదాలు జిల్లాలో చర్చనీయాంశమయ్యాయి. కూడ్లిగి తాలూకాలోని నరసింహ గిరిలోని శ్రీనివాస్ నివాసంలో ఈడీ దాడులు జరిగాయి. ముఖ్యమైన పత్రాల కోసం వెతికినట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు వాల్మీకి మండలి స్కాంలో ఎంతోమంది పేర్లు వచ్చాయి కానీ, శ్రీనివాస్ను ఎక్కడా ప్రస్తావించలేదు. శ్రీనివాస్ బెంగళూరులో ఉన్నారని, దాడుల గురించి తెలిసి బయల్దేరారని సమాచారం.
బళ్లారి ఎంపీ, ఎమ్మెల్యే, కూడ్లిగి ఎమ్మెల్యే ఇళ్లపై ఈడీ దాడులు
మాజీ మంత్రి నాగేంద్ర పీఏ ఇంటిలోనూ సోదాలు
వాల్మీకి మండలి నిధుల స్కాంలో మరోసారి పంజా
కాంగ్రెస్ వర్గాల్లో గుబులు
మాజీ మంత్రి శ్రీరాములు
నైతికత ఉంటే తప్పుకోండి
శివాజీనగర: మహర్షి వాల్మీకి అభివృద్ధి మండలి సొమ్మును స్వాహాచేసిన బళ్లారి ఎంపీ వీవీ తుకారాం, ఎమ్మెల్యేలకు నైతిక బాధ్యత ఉంటే పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని బీజేపీ మాజీ మంత్రి బి.శ్రీరాములు డిమాండ్ చేశారు. బుధవారం విలేకరులతో మాట్లాడిన ఆయన, ఎస్టీల సంక్షేమం కోసం రిజర్వు చేసిన సొమ్మును ఎంపీ తుకారాం, ఎమ్మెల్యేలైన బీ.నాగేంద్ర, జే.ఎన్.గణేశ్, నారా భరత్రెడ్డి, శ్రీనివాసమూర్తి దోచుకొన్నది ఈడీ ఆధారాలతో రుజువైంది. వీరు ఏ నైతికతతో అధికారంలో కొనసాగుతారని మండిపడ్డారు. రాజీనామా చేయాలి, లేదా ఓటర్లకు డబ్బు పంపిణీ చేసిన ఆరోపణతో ఎన్నికల కమిషన్ వీరి సభ్యత్వాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మేం స్వచ్ఛమైనవారని వీరు చాలా మాట్లాడుతున్నారు అని కొన్ని సామెతలతో ఎద్దేవా చేశారు. సండూరు ఉప ఎన్నికల్లో నన్ను అంతం చేయాలనే కుట్రతో వాల్మీకి అభివృద్ధి మండలి సొమ్మును ఖర్చు చేశారన్నారు. గాలి జనార్ధనరెడ్డికి బెయిల్ రావడం గురించి ప్రస్తావించగా, దీని గురించి పూర్తిగా తెలుసుకొని మాట్లాడుతానన్నారు. కుల గణనకు సిద్దు సర్కారు కోట్లాది రూపాయల ఖర్చు చేశారని, మళ్లీ సర్వే చేస్తామని ఇప్పుడు చెబుతున్నారని ఆరోపించారు.

ఈడీ మెరుపు దాడి

ఈడీ మెరుపు దాడి

ఈడీ మెరుపు దాడి