
కశ్మీర్లో కొప్పళవాసులు క్షేమం
హొసపేటె: జమ్ముకశ్మీర్ పర్యటనకు వెళ్లిన కొప్పళకు చెందిన 19 మంది క్షేమంగా ఉన్నారు. ఈ విషయంపై వారు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడి తాము సురక్షితంగా ఉన్నామని చెప్పారు. కొప్పళ నగర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాటన్ పాషా, వ్యాపారవేత్త శివకుమార్ పవలిశెట్టర్, శరణప్ప సజ్జన్, సిద్దు గన్వారీ కుటుంబ సభ్యులతో కలిసి వారం రోజుల పర్యటన కోసం మంగళవారం శ్రీనగర్ బయలుదేరారు. ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో వారు తమ ప్రయాణాన్ని ముగించుకుని తిరిగి వస్తున్నట్లు తెలిపారు. విహారయాత్రకు వెళ్లిన శివకుమార్ పవలిశెట్టర్ సోదరుడు మల్లికార్జున్ మీడియాతో మాట్లాడుతూ తన సోదరుడు, కుటుంబం వారం రోజుల పర్యటన కోసం కశ్మీర్కు వెళ్లారు. వారు తమకు ఫోన్ చేసి అక్కడ సురక్షితంగా ఉన్నామని చెప్పారన్నారు. ఈ ఉదయం వారు శ్రీనగర్లో తిరుగుతున్న ఫోటోలు, వీడియోలను పంపారు. శ్రీనగర్ పూర్తిగా మూతపడింది. తన సోదరుడు ఈ సాయంత్రం అక్కడి నుంచి తిరిగి వస్తారు. ఆయన మంత్రి సంతోష్లాడ్ను కలిశారు అని అన్నారు. కాటన్ పాషా కుమారుడు సుఫియాన్ స్పందిస్తూ తన తండ్రి, తల్లి, ముగ్గురు సోదరీమణులు కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఉగ్రవాదులు కాల్పులు జరిపారని విన్న తర్వాత మేం భయపడ్డామన్నారు. కొప్పళ నుండి మొత్తం 19 మంది కశ్మీర్ టూర్కు వెళ్లారని తెలిపారు.
ఫీజుల దుర్వినియోగంపై ఎఫ్డీఏ సస్పెండ్
హుబ్లీ: నృపతుంగ గుట్ట పార్కులో వసూలు చేసిన ప్రవేశ రుసుము బాపతు నగదును దుర్వినియోగం చేసిన ఆరోపణలపై హుబ్లీ ప్రాంతీయ అటవీ రేంజ్ ఎఫ్డీఏ విశ్వనాథ్ మహాజన్పై సస్పెన్షన్ వేటు పడింది. ధార్వాడ డివిజన్ కార్యాలయం ద్వారా హుబ్లీ పరిధి కార్యాలయంలో 2024 జనవరి 10 నుంచి 2025 ఫిబ్రవరి 12 వరకు కార్యాలయంలో అన్ని శాఖల నిర్వహణ చేసే వారు ఈ సందర్భంగా డిప్యూటీ రేంజ్ అటవీ అధికారి ఎంఎస్ రాయనగౌడ, బందోబస్తు అటవీ పాలకి సుమిత్ర బొమ్మనవాడ, సదరు గుట్టలో వసూలు చేసిన రూ.15,57,880 సేకరించి బ్యాంక్కు జమ చేయకుండా విశ్వనాథ్ చేతికిచ్చారు. అయితే ఇందులో రూ.8,95,470 మాత్రమే బ్యాంక్లో జమ చేశారు. మిగిలిన రూ.6,62,410 లను విశ్వనాథ్ దుర్వినియోగం చేసిన నేపథ్యంలో సంబంధిత అటవీ అధికారి రామలింగప్ప ఉప్పార అశోక్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై శాఖ వారు దర్యాప్తు జరిపిన ధార్వాడ సర్కిల్ ముఖ్య అటవీ సంరక్షణ అధికారి నితీష్కుమార్ నియమాల ఉల్లంఘన నేపథ్యంలో డిప్యూటీ అటవీ సంరక్షణ అధికారి వివేక్ కవరి విశ్వనాథ్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు వెల్లడించారు.
తాగునీటి ఎద్దడి నివారించండి
రాయచూరు రూరల్: గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ తాలూకా స్థాయి అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా పంచాయతీ సభా భవనంలో జరిగిన టాస్క్ఫోర్స్ సమావేశంలో మాట్లాడారు. వేసవి కాలం ప్రారంభమైనందున మూడు నెలల పాటు ప్రజలు తాగు నీటి ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. నీటి సౌకర్యాలు లేని గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరందించేందుకు యజమానులతో చర్చించాలన్నారు. తాలూకాలో అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులకు పంట నష్టం అంచనాలను తయారు చేసి పరిహారం అందించాలన్నారు. జలజీవన్ మిషన్, జలధార పథకాలను సక్రమంగా అమలు చేయాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ గజానన బలి, టీపీ ఈఓ చంద్రశేఖర్, తహసీల్దార్ సురేష్ వర్మ, ఆర్ఏపీఎంసీ అధ్యక్షుడు జయంతి రావ్ పతంగి, పవన్ పాటిల్లున్నారు.
ఉగ్రదాడి నుంచి
నలుగురు సురక్షితం
హొసపేటె: కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడి నుంచి నగరానికి చెందిన నలుగురు సురక్షితంగా బయట పడ్డారు. రాజశేఖర్, అతని కుటుంబం ఈనెల 18న కశ్మీర్కు బయలుదేరారు. టీఎంఏఈ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ టీఎం రాజశేఖర్, ఆయన భార్య ఉమాదేవి, కుమార్తె డాక్టర్ గౌరిక, అల్లుడు దొడ్డబసయ్య సముద్ర మట్టానికి పది వేల అడుగుల ఎత్తులో ఉన్న పహల్గాం ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించారు. రాజశేఖర్ తప్ప, కుటుంబ సభ్యులు మంగళవారం మధ్యాహ్నం 2.18 గంటలకు బైసార్ సమీపంలోని దుకాణానికి కుంకమపువ్వు కొనడానికి వచ్చారు. అప్పుడు అకస్మాత్తుగా ఐదు లేదా ఆరు అడుగుల దూరంలో కాల్పులు జరుపుతున్న ఉగ్రవాదులను చూసి, వారు అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలను కాపాడుకోడానికి కిందకు దిగారు. శ్రీనగర్ నుండి దాదాపు 8 కిమీ దూరంలో ఉన్న ఈ ప్రదేశం చాలా అందమైన పర్యాటక కేంద్రం. ప్రతి రోజు దేశ, విదేశాల నుంచి వేలాది మంది పర్యాటకులు అక్కడికి వస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ భద్రతకు సైనిక దళాలను మోహరించలేదు. ఈ ప్రదేశంలో మొబైల్ నెట్వర్క్ లేదు. చరిత్రలో ఈ ప్రదేశంలో ఎప్పుడూ ఉగ్ర దాడి జరగలేదు అని రాజశేఖర్ను ఫోన్లో సంప్రదించినప్పుడు తెలియజేశారు.

కశ్మీర్లో కొప్పళవాసులు క్షేమం

కశ్మీర్లో కొప్పళవాసులు క్షేమం