
ఉల్లి రైతులకు కన్నీటి పొర
దొడ్డబళ్లాపురం: ఉల్లిగడ్డలు ధరలు బాగా తగ్గిపోయాయి. సాగుచేసిన రైతులకు కూలీల ఖర్చులు కూడా దక్కడం లేదు. కోత కోసి మార్కెట్కు తరలిస్తే గిట్టుబాట కాక, పంటను ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. ఈ తరుణంలో ఉల్లి పొలాన్ని గొర్రెలు మేకలకు వదిలేశాడో రైతన్న. ఈ సంఘటన హడగలి తాలూకా ఉత్తంగి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామం నివాసి మూలిమని శరణప్ప పంటను గొర్రెలతో మేయించిన రైతు. 3 ఎకరాల పంటను గొర్రెలు ఆరగించాయి.
క్వింటాలు రూ.800 మాత్రమే
బెంగళూరు మార్కెట్లో క్వింటాల్ ధర రూ.800, గరిష్టమంటే రూ,1000 పలుకుతోంది. పంట కోతకోసి గ్రేడింగ్ చేసి తరలించడానికి 50 కేజీల పాకెట్కు రూ.300 నుంచి రూ.400 ఖర్చవుతుంది. ఇవికాకుండా ఇతర ఖర్చులు పోను ఏ మాత్రం గిట్టుబాటు కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట వీధుల్లో కేజీ ధర రూ.10– 20 మధ్య ఊగిసలాడుతోంది. విదేశాలకు ఎగుమతులు, శుభకార్యాలు తగ్గిపోవడంతో డిమాండు అంతంతమాత్రంగా ఉంది. గతేడాది ఇదే సమయంలో మంచి ధర ఉండేది. ఇక రెండు నెలల నుంచి పొలాల నుంచి పంట ఎక్కువగా వస్తుండడంతో గిరాకీ తగ్గి ధర పడిపోయినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఏదోరకంగా ఆదుకోవాలని ఉల్లి రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ధరలు దారుణంగా పతనం
గొర్రెలకు వదిలేసిన పంట

ఉల్లి రైతులకు కన్నీటి పొర