కథల పుస్తకాలు చదివేవాడిని
సిరిసిల్ల: వేసవి సెలవులు వస్తున్నాయంటే ఎంతో సంతోషంగా ఉండేదని రాజన్నసిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ అన్నారు. ఎండాకాలం సెలవుల్లో తన చిన్నతనంలో ఎలా గడిపేవారో వివరించారు. ఆయన మాటల్లోనే.. బాల్యం .. నిజంగానే అమూల్యమైనది. తిరిగిరాని గొప్ప వరం. వేసవి సెలవులు వస్తే.. చాలు మా ఊరిలోని పెద్దవాగులో ఈతకొడుతూ.. ఈతకాయలు.. తాటి ముంజలు తింటూ ఎంజాయ్ చేస్తూ గడిపే వాడిని. మాది నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వెల్గ టూర్. నాన్న గడ్డం రాంరెడ్డి ప్రభుత్వ టీచర్, అమ్మ పద్మ. మా అమ్మమ్మ ఊరు కమ్మర్పల్లి మండలం నాగాపూర్. వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఊరికి వెళ్లేవాడిని. ఈ రోజుల్లో లాగా మాకు సెల్ఫోన్లు, టీవీలు అందుబాటులో లేవు. నిజానికి మా నాన్న బాలమిత్ర, బాలజ్యోతి చందమామ వంటి పుస్తకాలు తెప్పించి చదివించేవారు. వేసవి సెలవుల్లోనూ క్రికెట్ వంటి ఆటలతోపాటు కథల పుస్తకాలు బాగా చదివే వాడిని. ఇప్పటికీ నాపై ఆ ప్రభావం ఉంటుంది. వేసవి సెలవులు వస్తున్నాయంటేనే ఎంతో సంతోషంగా ఉండేది. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది.


