భద్రాచలం నుంచి పంపించిన పట్టువస్త్రాలు
స్వామివారికి సమర్పించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
స్వామివారికి పట్టువస్త్రాలు తీసుకొస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, భద్రాచలం ఆలయ ఈవో, అర్చకులు, అధికారులు
ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేస్తున్న అర్చకులు
మల్యాల: మల్యాల మండలం కొండగట్టులోని శ్రీఆంజనేయస్వామి వారి పెద్ద జయంతి ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. భద్రాచలంలోని శ్రీసీతారాముల ఆలయం నుంచి ఆలయ ఈవో దామోదర్ పట్టువస్త్రాలు తీసుకొచ్చారు. వాటిని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వీకరించి.. వైజంక్షన్ నుంచి మేళతాళాలు, డప్పు చప్పుళ్లు, ఒగ్గు డోలు కళాకారుల విన్యాసాల మధ్య శోభాయాత్రగా అంజన్న ఆలయానికి చేరుకుని స్వామివారికి సమర్పించారు.
తరలివస్తున్న భక్తులు..
ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, హైదరాబాద్తోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. సుమారు 3 నుండి 4లక్షల మంది భక్తులు తరలివస్తారనే అంచనాతో అధికారులు ఆలయంలో లడ్డూ, ప్రసాదాలు, తాగునీటి వసతులు కల్పించారు.


