కరీంనగర్టౌన్: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 11 నుంచి 17 వరకు జిల్లాలో ప్రత్యేక విద్యా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ చిత్రామిశ్రా, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి తెలి పారు. విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల్లో సృజనాత్మకత, ప్రభుత్వ పాఠశాలల్లో నమోదుశాతం పెంచడం లక్ష్యంగా వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు ఉంటాయన్నారు. 11న ఫౌండేషన్ డే, సమ్మర్ క్యాంప్, 12న ఎస్సెస్సీ రిమీడియల్ క్యాంపుల ప్రారంభం, ఇంటర్ రిమీడియల్ క్యాంపుల ముగింపు కార్యక్రమాలు ఉంటాయన్నారు. 13న పాఠశాల విద్యా అభివృద్ధిపై సర్పంచ్లు, వార్డు సభ్యులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులతో వర్క్షాప్లు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల నమోదు, మౌలిక సదుపాయాల మెరుగుదలపై చర్చ నిర్వహించాలన్నారు. 14న జయశంకర్ బడిబాట కార్యక్రమంతో పాటు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించాలన్నారు. 15న లైబ్రరీ డే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. 16న ఆర్ట్, క్రాఫ్ట్, కల్చరల్ డే కళావైభవం పేరుతో జిల్లావ్యాప్తంగా నిర్వహించాలి. చిత్రలేఖనం, హస్తకళలు, నృత్యం, సంగీతం, సాంస్కృతిక పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేయాలి. 17న విద్యా విజయోత్సవం కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నారు. ఎస్సెస్సీ, ఇంటర్, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు అందజేయనున్నారు.


