యైటింక్లయిన్కాలనీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్కాలనీకి చెందిన బంగారు లక్ష్మి–రాజయ్య దంపతులకు ఐదుగురు కూతుళ్లు. వారి చిన్నతనంలోనే 2000 సంవత్సరంలో అనారోగ్యంతో రాజయ్య మృతిచెందాడు. అప్పటి నుంచి లక్ష్మి కూరగాయలు విక్రయిస్తూ, కూలీ పనులు చేస్తూ కూతుళ్లను చదివించి అందరికీ పెళ్లి చేసింది. ప్రసుత్తం చిన్న కిరాణ షాపు నడుపుతోంది. పెద్ద కుమార్తె స్వరూప డిగ్రీ పూర్తి చేసి ఆశవర్కర్గా ఉద్యోగం చేస్తోంది. రెండో కూతురు మంజుల 10వ తరగతి చదివి ఇంట్లోనే కుట్టు మిషన్ వర్క్ చేసుకుంటోంది. మూడో కూతురు రమాదేవి ఎంబీఏ చదివి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. నాలుగో కుమార్తె పద్మిని పీజీ చేసింది. ఐదో కుమార్తె సంగీత పీజీ (ఎమ్మెస్సీ) పూర్తి చేసి కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తోంది.


